బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ ఫిర్యాదు; ఎఫ్ఐఆర్ నమోదు
రాహుల్ గాంధీని 'ఎగతాళి' చేశారంటూ బీజేపీ నేత, ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కర్ణాటక కాంగ్రెస్ నాయకులు బెంగళూరులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ గాంధీని ఎగతాళి చేస్తూ మాల్వియా ట్వీట్ చేసిన యానిమేషన్ వీడియోపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత రమేష్ బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మాల్వియా ఇటీవల రాహుల్ గాంధీ అమెరికా పర్యటనపై ట్విట్టర్లో ఒక వీడియోను విడుదల చేసారు. రాహుల్ భారతీయ వ్యతిరేకిగా ప్రవర్తిస్తున్నట్లు ఆ ట్విట్లో పేర్కొన్నారు. అమిత్ మాల్వియాపై మరిన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని కాంగ్రెస్ నాయకుడు పవన్ పేర్కొన్నారు.
రాజకీయ కోణంలోనే ఈ కేసును నమోదు: తేజస్వీ సూర్య
కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ, న్యాయపరమైన అభిప్రాయం కోరిన తర్వాత పార్టీ ఈ ఫిర్యాదును నమోదు చేసినట్లు చెప్పారు. అది తప్పుడు ఉద్దేశ్యంతో నమోదు చేసినట్లు వారు భావిస్తే చట్టపరంగా ఎదుర్కోవాలని ఖర్గే పేర్కొన్నారు. ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలపై బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య స్పందించారు. రాజకీయ కోణంలోనే ఈ కేసును నమోదు చేసినట్లు చెప్పారు. అమిత్ మాల్వియాపై ఐపీసీ 153ఏ, 505(2) కింద కేసు నమోదైందని సూర్య వెల్లడించారు. ఈ రెండు సెక్షలు సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పారు. అయితే ఈ కేసులో రాహుల్ గాంధీ ఒక్కరు మాత్రమే ఉన్నారని సూర్య చెప్పారు. దీనిపై తాము కోర్టులో తేల్చుకుంటామని వెల్లడించారు.