
Corona Virus: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. 24 గంటల్లో 163 కేసులు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో కోవిడ్ వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులుగా 300కిపైగా నమోదవుతున్న కేసులు ఇప్పుడు 200లోపే నమోదవుతున్నాయి.
దీంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 163 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇందులో అత్యధికంగా ఢిల్లీలో 65 కేసులు, రాజస్థాన్లో 51 కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 6,483కి చేరింది.
Details
ప్రథమ స్థానంలో కేరళ
క్రియాశీల కేసులలో కేరళ రాష్ట్రం 1,384 కేసులతో ప్రథమ స్థానంలో ఉంది. గుజరాత్లో 1,105, పశ్చిమ బెంగాల్లో 747, కర్ణాటకలో 653, ఢిల్లీలో 620 యాక్టివ్ కేసులున్నాయి.
కరోనా కారణంగా నిన్న ఒక్కరోజే నాలుగు మరణాలు చోటు చేసుకున్నాయి. ఇందులో మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, కేరళలో ఒక్కొక్కరు మృతి చెందారు.
దీంతో కలిపి 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 113కి పెరిగినట్లు అధికారికంగా ధృవీకరించారు.
మొత్తం మీద దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతూ ఉండటం ఊరటనిచ్చే విషయం అయినప్పటికీ, జాగ్రత్తలు మాత్రం మినహాయించరాదని నిపుణులు సూచిస్తున్నారు.