Page Loader
UPSC: యూపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ నియామకం 
యూపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ నియామకం

UPSC: యూపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ నియామకం 

వ్రాసిన వారు Sirish Praharaju
May 14, 2025
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్మన్ పదవికి మాజీ రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులయ్యారు. కేంద్ర వ్యక్తిగత వ్యవహారాల శాఖ ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించింది. గతంలో యూపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన ప్రీతి సుదన్ పదవీకాలం ఏప్రిల్ 29వ తేదీన ముగియడంతో ఆ స్థానం ఖాళీగా ఉండిపోయింది. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాల మేరకు అజయ్ కుమార్‌ను యూపీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అజయ్ కుమార్ 1985 బ్యాచ్‌కు చెందిన భారత పరిపాలన సేవ (ఐఏఎస్) అధికారి. ఆయన కేరళ క్యాడర్‌కు చెందినవారు.

వివరాలు 

చైర్మన్‌తో పాటు మొత్తం పదిమంది సభ్యులు

ఆయన 2019 ఆగస్టు 23వ తేదీ నుంచి 2022 అక్టోబర్ 31వ తేదీ వరకు రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. దేశంలోని అత్యున్నత సివిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహించే బాధ్యత యూపీఎస్సీకి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇందులో ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ లాంటి కీలక సర్వీసులతో పాటు ఇతర సర్వీసుల‌కు సంబంధించిన పరీక్షల నిర్వహణ బాధ్యత యూపీఎస్సీదే. యూపీఎస్సీలో ఒక చైర్మన్‌తో పాటు మొత్తం పదిమంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతానికి ఈ కమిషన్‌లో రెండు సభ్య పదవులు ఖాళీగా ఉన్నాయి. యూపీఎస్సీ చైర్మన్ పదవికి గరిష్ఠ కాలపరిమితి ఆరు సంవత్సరాలు. అయితే పదవిలో కొనసాగడానికి వ్యక్తి వయసు 65 ఏళ్లను మించకూడదనే నిబంధన ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

UPSC ఛైర్మన్‌గా మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ నియామకం