
Andhra Weather: రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ కి ముసురు పట్టింది. ఇప్పటికే వానలు దంచికొడుతుండగా.. వర్షాలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వెదర్ అప్ డేట్ వచ్చింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం అధికారి తార స్వరూప తెలిపారు. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని, త్వరలో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తా ప్రాంతాల్లోనూ కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వివరాలు
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం
తీర ప్రాంతాలలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, చేపల వేటకు సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉపరి ప్రాంతాల్లో వర్షాలు పెరిగిన నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. జూరాల ప్రాజెక్ట్ నుంచి సుమారు 1.02 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వస్తోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం అది 861.70 అడుగులకు చేరిందని అధికారులు పేర్కొన్నారు.
వివరాలు
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం
అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో 111.4 టీఎంసీల నీరు నిల్వగా ఉందని వెల్లడించారు. ఇప్పటి వరద పరిస్థితుల దృష్ట్యా, నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జలాశయం పరిసరాల్లో నివసించే వారు అధికారుల సూచనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.