ఇవాళ ఇండియా కూటమి మూడో కీలక సమావేశం..ఖరారు కానున్న ప్రచార వ్యూహం, లోగో
ఈ వార్తాకథనం ఏంటి
ఇవాళ ముంబైలో విపక్షాల కూటమి మూడోసారి భేటీ కానుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి వ్యతిరేకంగా లోగో, సమన్వయ కమిటీతో పాటు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనున్నారు.
ఇప్పటికే ఇండియా కూటమికి చెందిన పలువురు నేతలు, కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ప్రత్యర్థిగా నిలువగలిగే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఈ మేరకు ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్(ఇండియా) సమావేశం జరగనుంది.భేటీకి దాదాపు 28 రాజకీయ పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.
ఈ క్రమంలోనే కూటమికి సంబంధించిన లోగోను ఎంపిక చేయడంతోపాటు విపక్షాల మధ్య సమన్వయం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు.
DETAILS
2024 ఎన్నికల కోసం ఉమ్మడి కార్యాచరణ షెడ్యూల్ను ప్రకటించే అవకాశం
మరోవైపు విపక్షాల కూటమికి కన్వీనర్ను ఏర్పాటు చేయాలా లేదా అనే అంశంపై చర్చలు జరపనున్నారు. అనంతరం 2024 ఎన్నికల కోసం ఉమ్మడి కార్యాచరణ షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది.
ఇప్పటికే మమతా బెనర్జీ, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ సహా పలువురు ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు ముంబై చేరుకున్నారు.
అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, నితీష్ కుమార్, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇవాళ ముంబైకి రానున్నారు. తర్వాత మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇచ్చే విందుకు హాజరవుతారు.
దేశంలో రాజకీయ మార్పు కోసం ప్రతిపక్ష కూటమి బలమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందన్న నమ్మకం ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.