
India: ఆపరేషన్ సిందూర్ తర్వాత 52 సైనిక ఉపగ్రహాల ప్రయోగాన్ని వేగవంతంచేసిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
'ఆపరేషన్ సిందూర్' తర్వాత భారత్ అంతరిక్షంలో నిఘా సామర్థ్యాన్ని మరింత స్థాయికి చేర్చేందుకు కీలక చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా చైనా, పాకిస్థాన్, హిందూ మహాసముద్ర పరిసర ప్రాంతాలపై నిఘా కొనసాగించేందుకు 52 సైనిక ఉపగ్రహాలను ఆవిష్కరించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రియల్టైమ్ మానిటరింగ్ వంటి అత్యవసర అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.26,968 కోట్లు ఖర్చు చేయనుంది. చైనా అంతరిక్ష రంగంలో వేగంగా పురోగమిస్తూ ఆధిపత్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, భారత ప్రభుత్వం దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యూహాన్ని తయారు చేస్తోంది.
వివరాలు
ఏప్రిల్ 2026 నాటికి అంతరిక్షంలో..
ఈ కార్యచరణలో భాగంగా, 'స్పేస్ బేస్డ్ సర్వైలెన్స్ (SBS)' మూడవ విడత ప్రణాళిక కింద ఇస్రో 21 ఉపగ్రహాలను ప్రయోగించనుంది. మిగతా 31 శాటిలైట్ల అభివృద్ధి బాధ్యతను మూడు ప్రైవేటు సంస్థలకు అప్పగించి, అవి స్వతంత్రంగా వాటిని కక్ష్యలోకి పంపనున్నాయి. ఈ ప్రాజెక్టు కింద తొలి శాటిలైట్ను ఏప్రిల్ 2026 నాటికి అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. మొత్తం 52 శాటిలైట్లు 2029 చివరికి పూర్తి స్థాయిలో కక్ష్యలోకి చేరతాయి. ఈ ప్రణాళికలో ఒక భాగంగా, ఇస్రో అభివృద్ధి చేసిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీని ప్రైవేటు రంగ సంస్థలకు బదిలీ చేయనున్నారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే శాటిలైట్లు ప్రయోగించేందుకు వీలవుతుంది.
వివరాలు
ఆపరేషన్ సిందూర్ సమయంలో పెద్దఎత్తున ఉపగ్రహ నిఘా
లో ఎర్త్ ఆర్బిట్ (LEO),జియో స్టేషనరీ ఆర్బిట్ (GEO)లపై ప్రధానంగా దృష్టి సారించే ఈ ప్రాజెక్టును ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ పర్యవేక్షించనుంది. అంతేగాక, చైనా యాంటీ శాటిలైట్ వ్యవస్థల ఎదురుదాడికి ఇది సమర్థవంతంగా పని చేస్తుంది. ఇదిలా ఉండగా, ఆపరేషన్ సిందూర్ అమలు సమయంలో కూడా భారతదేశం పెద్దఎత్తున ఉపగ్రహ నిఘాను మోహరించింది. ఇందులో ఇస్రో రూపొందించిన ఉపగ్రహాల తోపాటు,ఇతర అంతర్జాతీయ మద్దతును కూడా సద్వినియోగం చేసుకుంది. ప్రస్తుతం భారత వద్ద సుమారు 9 నుండి 11 మిలిటరీ శాటిలైట్లు ఉన్నాయి. వీటి ద్వారా వచ్చిన సమాచారాన్ని ఇస్రో తక్షణమే సైనిక దళాలకు అందించింది. అలాగే, ఓ కమర్షియల్ గ్లోబల్ శాటిలైట్ ఆపరేటర్ నుంచి ఫొటోలను కూడా సేకరించింది.
వివరాలు
భారత్కు యుద్ధరంగాల్లో రియల్టైమ్ డేటా తక్షణమే అందే అవకాశాలు
దీనితో పాటు, ఇస్రో సొంతంగా అభివృద్ధి చేసిన కార్టోశాట్ శ్రేణిలోని ఉపగ్రహాలను కూడా మిషన్ కోసం వినియోగించింది. ఇవి ఆధారంగా సైనిక దళాలు ఖచ్చితమైన వ్యూహంతో పాకిస్థాన్ సైనిక స్థావరాలపై దాడులు జరిపాయి. అంతేకాకుండా, అమెరికాకు చెందిన మ్యాక్సర్, ఐరోపాకు చెందిన సెంటినెల్ వంటి అంతర్జాతీయ సంస్థల సేవలను కూడా భారత్ వినియోగించింది. ఇవి రోజుకు ఒక్కసారి చిత్రాలను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించగా, మన దేశపు శాటిలైట్లు ప్రతి 14 రోజులకు ఒకసారి పీరియాడిక్ డేటాను అందించగలవు. తాజాగా చేపట్టిన ఈ కొత్త ప్రాజెక్టు విజయవంతమైతే, భారత్కు యుద్ధరంగాల్లో రియల్టైమ్ డేటా తక్షణమే అందే అవకాశాలు మెరుగుపడతాయి.