
Rajnath Singh:పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్నిఎదుర్కోవడానికి భారతదేశం అన్ని పద్ధతులను ఉపయోగిస్తుంది: రాజ్నాథ్ సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు భారత దేశ తొలి స్వదేశీ యుద్ధ నౌక అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ను సందర్శించారు.
ఈ సందర్బంగా ఆయన నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రస్తుత పరిస్థితులలో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను,వారి దుష్ట ఉద్దేశాలను భారతదేశం తక్కువ సమయంలోనే సమూలంగా ధ్వంసం చేసిందని తెలిపారు.
భారత దళాలు చాలా శక్తివంతంగా,స్పష్టతతో కూడిన దాడులు జరిపాయని,ఈ దాడులు పాకిస్థాన్ ను అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితికి నెట్టాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
భారత సైనిక దళాలు నిర్వహించిన దాడులు వేగవంతంగా,తీవ్రతతో,అనూహ్యంగా జరిగాయని ఆయన కొనియాడారు.
'ఆపరేషన్ సిందూర్' ద్వారా కేవలం ఉగ్రవాదులకే కాకుండా,వారిని సంరక్షించే, ప్రోత్సహించే శక్తులకు కూడా గట్టి హెచ్చరిక పంపినట్లు ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
ఉగ్రవాదంపై సమగ్ర దాడి
ఈ ఆపరేషన్లో భారత నౌకాదళం కీలక భూమిక పోషించిందని మంత్రి వివరించారు.
ఒకవైపు భారత వైమానిక దళం (IAF) పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తుండగా, మరోవైపు ఆరేబియా సముద్రంలో భారత యుద్ధనౌకలు పాకిస్థాన్ నౌకాదళాన్ని వారి తీర ప్రాంతానికే పరిమితం చేశాయని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ను కేవలం సైనిక చర్యగా కాకుండా, ఉగ్రవాదంపై సమగ్ర దాడిగా చూడాలంటూ ఆయన వ్యాఖ్యానించారు.
పాక్లో ఉగ్రవాద శక్తులను కూల్చివేయడం కోసం అవసరమైన ఏ విధానాన్నైనా భారతదేశం అమలు చేస్తుందని, అవి పాకిస్తాన్ ఊహించలేని స్థాయిలో ఉంటాయని హెచ్చరించారు.
ఆఖరగా, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పాకిస్తాన్ ఆడుతున్న ప్రమాదకరమైన ఉగ్రవాద ఆట ఇప్పుడు ముగిసిందని స్పష్టంగా తెలిపారు.