Janasena Cm : సీఎం పదవిపై పవణ్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..ఏమన్నారో తెలుసా
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి.ఈ మేరకు ఏపీ సీఎం పదవిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు ముఖ్యమంత్రి పదవి వస్తే స్వీకరిస్తానన్నారు. కానీ అంతకంటే ముందు ఏపీ ప్రజల భవిష్యత్ ముఖ్యమని కుండబద్దలు కొట్టారు. రానున్న ఎన్నికల్లో వైకాపాను గద్దె దించాలని, జనసేన, టీడీపీ సర్కారు ఏర్పాటయ్యేలా సాగుదామని పార్టీ క్యాడర్ కు మార్గదర్శకం చేశారు. సీఎం స్థానం పట్ల ఏ రోజూ విముఖత చూపలేదని, సుముఖతతోనే ఉంటానని శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశంలో పవన్ అన్నారు. కానీ, ఈరోజు మన ప్రాధాన్యం సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్ ముఖ్యమన్నారు. ప్రజల భవిష్యత్తు బాగుండాలన్నదే జనసేన ఆకాంక్ష అన్నారు.
జనసేన సభ్యత్వం ఎంతో తెలుసా
గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పనిచేయాలని జనసేనా కార్యకర్తలకు సూచించారు. ప్రతికూల సమయంలోనే నాయకుడి ప్రతిభ తెలుస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు. టీడీపీ-జనసేన ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన జెండా ఎగురవేయాలని ఆయన ఆకాంక్షించారు. ఎవరి అండదండలు లేకుండానే కేవలం జనాదరణతోనే మనం ఇంతదూరం ప్రయాణించామని పార్టీ ముఖ్యనేతలతో అన్నారు. 150 మంది క్రియాశీల సభ్యులతో ప్రారంభమైన పార్టీలో ప్రస్తుతం 6.5 లక్షల మందికిపైగా సభ్యులున్నారన్నారు. జనసేన పార్టీకి కళ్లు, చెవులు క్రియాశీల సభ్యులేనని, వారి అభిప్రాయాలు నివేదిక రూపంలో తీసుకుంటున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో చిన్న ఇబ్బందులున్నప్పటికీ సర్దుకని ముందుకెళ్లాలని శ్రేణుల్లో ఉత్తేజం నింపారు.