
Kerala: కశ్మీర్ ఉగ్రవాద దాడి నుండి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు న్యాయమూర్తులు,ఎమ్మెల్యేలు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఈ హింసాత్మక చర్యలో పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కొంతమంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
పర్యటన నిమిత్తం జమ్మూకశ్మీర్ వెళ్లిన కేరళ హైకోర్టు న్యాయమూర్తులు, కొంతమంది ఎమ్మెల్యేలు ఈ దాడి నుంచి తృటిలో బయటపడినట్టు సమాచారం.
ఈ విషయాన్ని అధికారికంగా కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.
వివరాలు
వారందరూ పూర్తి సురక్షితంగా ఉన్నారు: సీఎంవో
జమ్మూకశ్మీర్ పర్యటనలో భాగంగా, కేరళ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ కె నరేంద్రన్, జస్టిస్ పీజీ అజిత్ కుమార్, జస్టిస్ జి. గిరీష్ తదితరులు అలాగే ఎమ్మెల్యేలు ముకేశ్, కేపీఏ మజీద్, టి. సిద్ధిక్, కె. అన్నాలన్ కూడా వెళ్లారు.
వీరంతా ఉగ్రదాడి చోటుచేసుకున్న సమయంలో దగ్గరలో ఉన్నప్పటికీ, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
ప్రస్తుతం వీరంతా శ్రీనగర్లో ఉన్నారు. వారందరూ పూర్తి సురక్షితంగా ఉన్నారని సీఎం కార్యాలయం తెలిపింది.
జమ్మూకశ్మీర్లో చిక్కుకుపోయిన ఇతర కేరళ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి రప్పించే చర్యలు తీసుకుంటున్నామని కూడా సీఎంవో వెల్లడించింది.
వివరాలు
ఎర్నాంకులమ్కు చెందిన వ్యక్తి మృతి
ఈ ఉగ్రదాడిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దాడిలో ఎర్నాంకులమ్కు చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు.
బాధితుడి కుటుంబ సభ్యులను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.
కాగా, పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో సైనిక దుస్తుల్లో ముసుగుపట్టిన ఐదుగురు ముష్కరులు పురుషులనే లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడ్డారు.
ఈ దాడిలో మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
వివరాలు
దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు.. 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' అనే ఉగ్రవాద సంస్థకు చెందినవారు
ఈ ఘోర ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఉగ్రదాడికి బాధ్యులను పట్టుకోవాలన్న కసితో భద్రతా బలగాలు తమ చర్యలను ముమ్మరం చేశాయి.
దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల ఉహాచిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి.
వారిని ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తాలాగా గుర్తించారు. వీరంతా 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' అనే ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా నిర్ధారణ అయింది.
ప్రస్తుతం వారిని పట్టుకునేందుకు ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.