Page Loader
Lawrence Bishnoi: జైలులో ఉన్న లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు  ఏడాదికి రూ.40 లక్షలు ఖర్చు.. !
జైలులో ఉన్న లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏడాదికి రూ.40 లక్షలు ఖర్చు.. !

Lawrence Bishnoi: జైలులో ఉన్న లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు  ఏడాదికి రూ.40 లక్షలు ఖర్చు.. !

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2024
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ పేరు దేశ వ్యాప్తంగా చర్చకు వస్తోంది. ప్రస్తుతం అతడు జైలులో ఉన్నా, అతని సోదరుడు, అనుచరుడు కెనడా నుంచి వారి గ్యాంగ్‌ను నిర్వహిస్తున్నారు. అయితే, లారెన్స్‌ బిష్ణోయ్‌ గురించి అతని బంధువు రమేష్ బిష్ణోయ్ తాజాగా కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు.

వివరాలు 

న్యాయవిద్యను పూర్తి చేసిన లారెన్స్‌ బిష్ణోయ్‌

పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యను పూర్తి చేసిన లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌స్టర్‌గా మారతాడని తానూ ఎప్పుడూ ఊహించలేదని రమేష్‌ పేర్కొన్నారు. జైల్లో ఉన్నప్పటికీ, బిష్ణోయ్‌ కుటుంబం అతడి అవసరాల కోసం సంవత్సరానికి రూ.40 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు రమేష్‌ బిష్ణోయ్‌ తెలిపారు. "మా కుటుంబం ముందు నుంచి కూడా సంపన్న కుటుంబమే. లారెన్స్‌ తండ్రి హరియాణా పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. వారికి మా గ్రామంలో సుమారు 110 ఎకరాల భూమి ఉంది. లారెన్స్ ఎప్పుడూ ఖరీదైన దుస్తులు, బూట్లు ధరించేవాడు. ఇప్పుడు కూడా జైలులో ఉన్న అతడికి మా కుటుంబం సంవత్సరానికి రూ.40 లక్షలు ఖర్చు చేస్తోంది" అని ఆయన అన్నారు.

వివరాలు 

ద్యార్థి సంఘం నాయకుడిగా.. పలు అసాంఘిక కార్యకలాపాలు

పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ జిల్లా ధత్తరన్‌వాలీ గ్రామంలో జన్మించిన బిష్ణోయ్ అసలు పేరు బాల్కరన్ బ్రార్. పాఠశాలలో చదువుతున్నప్పుడు అతడు తన పేరును లారెన్స్‌ బిష్ణోయ్‌గా మార్చుకున్నాడు. అతడు యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నప్పుడు పలు అసాంఘిక కార్యకలాపాలు ప్రారంభించాడు. డీఏవీ కాలేజీ గ్యాంగ్‌వార్‌లో అతడి ప్రియురాలిని ప్రత్యర్థి వర్గం సజీవ దహనం చేసింది. దీనితో, అతడు పూర్తిగా నేరాల వైపుకు మళ్లినట్లు చెబుతుంటారు. 2018లో తన అనుచరుడు సంపత్‌ నెహ్రాతో కలిసి సినీ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ హత్యకు కుట్రపన్నడంతో జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచాడు.

వివరాలు 

సిద్ధూ మూసేవాలా, బాబా సిద్ధిఖీపై దాడులు

కొన్నేళ్లుగా లారెన్స్‌ బిష్ణోయ్‌ జైలులోనే ఉంటున్నాడు. బ్యారక్‌ల్లోకి అక్రమంగా వచ్చే సెల్‌ఫోన్ల ద్వారా అతడు నిరంతరం తన అనుచరులతో సంబంధం కలిగి ఉంటూ, ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని హత్యల ప్రణాళికలు రచిస్తాడు. సిద్ధూ మూసేవాలా, బాబా సిద్ధిఖీపై దాడులు ఈ విధంగానే జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.