Mp Raghurama : మోదీజీ ఆ ఇద్దరు ఐపీఎస్లు నన్ను వేధించారు..చర్యలు తీసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ఈ మేరకు తనను కస్టోడియల్ టార్చర్కు గురిచేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తనపై దాడి జరిపిన అధికారుల్లో పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ అధికారులున్నారని ఫిర్యాదు చేశారు.
లోక్సభ నాయకుడిగా ప్రధాన మంత్రి తనపై జరిగిన దాడికి సంబంధించి సీబీఐ, ఎన్ఐఏల దర్యాప్తునకు ఆదేశించాలన్నారు. తనపై దాడి పట్ల పార్లమెంట్ కమిటీ ద్వారాను విచారణ జరిపించాలన్నారు.
సీఐడీ అధికారుల కాల్ డేటాలను భద్రపరిచేలా చూడాలని, ఇదే సమయంలో తన కస్టోడియల్ టార్చర్పై సీబీఐ విచారణ జరపాలని హైకోర్టులో గతంలోనే రఘురామ పిటిషన్ దాఖలు చేశారు.
details
కాల్ డేటాను సేకరించాలని సీబీఐను ఆదేశించిన హైకోర్టు
స్పందించిన ఉన్నత న్యాయస్థానం రఘురామను అదుపులోకి తీసుకున్న సమయంలో సీఐడీ అధికారుల కాల్ డేటాను భద్ర పరచాలని సీబీఐను ఆదేశించింది.కాల్ డేటాను వెంటనే సేకరించాలని సీబీఐను హైకోర్టు ఆదేశించింది.
మరోవైపు సీబీఐ వాదనలపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.పిటిషనర్ సీఐడీ మీద ఆరోపణలు చేశారని, కాల్ డేటా సేకరించాలని సీఐడీనే ఎలా ఆదేశిస్తామని న్యాయవాదిని ప్రశ్నించింది.
దీంతో సీఐడీ అధికారులు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయగా, కాల్ డేటా సేకరించాలనడం చట్టవిరుద్ధమని సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఈ కేసు దర్యాప్తు సీబీఐకు ఇవ్వాలా వద్దా అన్న అంశంపై కోర్టు ఇంకా నిర్ణయించలేదని,రఘురామ తరఫు న్యాయవాది నౌమీన్ చెప్పారు. ఈ మేరకు కాల్ డేటాను సేకరించి భద్రపరచాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.