 
                                                                                Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మహారాష్ట్రతో పాటు ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాల్లో రుతుపవనాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో రెండు రోజుల్లో రుతుపవనాలు మరింత బలహీనపడే సూచనలున్నాయని పేర్కొంది. ఈ సమయంలో దక్షిణ భారత ద్వీపకల్పం మీదుగా తూర్పు, ఈశాన్య గాలులు ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో దక్షిణ భారత రాష్ట్రాలు, మధ్య బంగాళాఖాతంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Details
వచ్చే 24 గంటల్లో మోస్తారు వర్షాలు
శనివారం నాడి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, అక్టోబర్ 14 నాటికి ఇది అల్పపీడనంగా మారవచ్చని పేర్కొన్నారు. మరొక 48 గంటల్లో ఈ ఆవర్తనం మరింత బలపడవచ్చని, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటి కదిలే అవకాశం ఉందని, ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తృత వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించారు. వచ్చే 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.