
Revanth Reddy: నర్సింగ్ కళాశాలల్లో జపాన్ భాషను బోధించండి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఉన్న 34 వైద్య కళాశాలలు పూర్తి సదుపాయాలతో సమర్థవంతంగా పనిచేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ లక్ష్యాన్ని సాధించేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను తక్షణమే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
ఇందుకోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలన్నారు. అయితే ఈ కమిటీ రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలలను పరిశీలించి,సమగ్రంగా వివరాలు కలిగిన నివేదికను రూపొందించి సమర్పించాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.
జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ)రాష్ట్ర వైద్య కళాశాలలపై అభ్యంతరంగా పేర్కొన్న పలు అంశాలపైనా సీఎం సమీక్ష చేపట్టారు.
ఈసమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వివరాలు
ముఖ్యమంత్రి సమీక్షలో ప్రధాన అంశాలు:
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉద్యోగ నియామకాలు, బోధన సిబ్బంది పదోన్నతులు, అనుబంధ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంపు, అవసరమైన వైద్య పరికరాల సమకూర్చడం, ఖాళీల భర్తీ వంటివన్నీ ఒకే నివేదికలో చేర్చి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సీఎం సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నిధుల విడుదలకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేస్తామని, అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు.
కేంద్ర ఆరోగ్య శాఖ ద్వారా రావలసిన నిధులు లేదా అనుమతుల విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా సహా సంబంధిత కేంద్రాధికారులను సంప్రదించి సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
వివరాలు
ముఖ్యమంత్రి సమీక్షలో ప్రధాన అంశాలు:
నర్సింగ్ కళాశాలల్లో జపాన్ భాషను ఒక ఐచ్చిక విభాగంగా (ఆప్షనల్గా) బోధించాలన్నారు. జపాన్ దేశంలో నర్సింగ్ సిబ్బందికి అధిక డిమాండ్ ఉందని పేర్కొంటూ, ఈ విషయంలో జపాన్ ప్రభుత్వం భారత్కు మద్దతుగా నిలవనున్నదని చెప్పారు.
"ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారిని పరీక్షించే వైద్యులు, ఆసుపత్రుల పని సమయాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక మొబైల్ యాప్పై అధ్యయనం చేయాలి" అని సూచించారు.
విద్యా,వైద్య రంగాలు అత్యంత కీలకమైనవని, అందుకే ప్రతి నెల మూడో వారం ఈ రెండు శాఖలపై సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశించారు.