Page Loader
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో మేజర్ యాంటీ-టెర్రర్ ఆపరేషన్ , కొత్తగా ఏర్పడిన టెర్రర్ గ్రూప్ విచ్ఛిన్నం..! 
జమ్ముకశ్మీర్‌లో మేజర్ యాంటీ-టెర్రర్ ఆపరేషన్ , కొత్తగా ఏర్పడిన టెర్రర్ గ్రూప్ విచ్ఛిన్నం..!

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో మేజర్ యాంటీ-టెర్రర్ ఆపరేషన్ , కొత్తగా ఏర్పడిన టెర్రర్ గ్రూప్ విచ్ఛిన్నం..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 22, 2024
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో పోలీసులు భారీ యాంటీ టెర్రర్ ఆపరేషన్‌ను చేపట్టారు. వరుసగా నిర్వహించిన సోదాల్లో కొత్తగా ఏర్పాటైన ఉగ్రగ్రూప్ తెహ్రీక్ లబైక్ యా ముస్లీమ్ (TLM)ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ గ్రూప్ లష్కరే తోయిబా అనుబంధ శాఖగా ఉంది. దాని కార్యకలాపాలను బాబా హమాస్ అనే పాకిస్థానీ వ్యక్తి పర్యవేక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గాందర్‌బల్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, ఈ భారీ ఎత్తున సోదాలు జరుగుతున్నాయి.

వివరాలు 

యువతను భారీగా రిక్రూట్ చేసుకుంటున్నటీఎల్‌ఎం 

శ్రీనగర్, గాందర్‌బల్, బాందిపొరా, కుల్గామ్, బుడ్గాం, అనంత్‌నాగ్, పుల్వామా జిల్లాల్లో ఈ సోదాలు జరిగాయి. తీవ్రవాద కార్యకలాపాల కోసం టీఎల్‌ఎం గత కొంత కాలంగా యువతను భారీగా రిక్రూట్ చేసుకుంటోందని, ఆ రిక్రూట్‌మెంట్ వ్యవస్థను చెదరగొట్టడమే సోదాల ప్రాథమిక లక్ష్యమని పోలీసులు వెల్లడించారు. బాబా హమాస్‌కు అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌లతో బలమైన సంబంధాలు ఉన్నాయి. చొరబాట్లను ప్రోత్సహించడం, ఆర్థిక వనరులను సమకూర్చడం, టీఎల్‌ఎంకు యువతను రిక్రూట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడని పేర్కొన్నారు.

వివారాలు 

ఉగ్ర ముఠా కోసం గాలింపు

ఇటీవల సోన్‌మార్గ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో స్థానికేతర కూలీలు మరియు వైద్యుడితో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, బలగాలు ఆ ఉగ్ర ముఠా కోసం గాలింపు చేపట్టాయి. 'జాతీయ దర్యాప్తు సంస్థ' (ఎన్‌ఐఏ) అధికారులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాడి చేసిన వారు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు, వారు ఆ ప్రాంతాన్ని ముందుగా పరిశీలించారని భావిస్తున్నారు. లేదంటే స్థానికులెవరైనా వారికి సహకరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కశ్మీర్ గత మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నా, ఈ ప్రాంతంలో ఇలాంటి హింసాత్మక ఘటన జరగడం ఇదే తొలిసారి.