మణిపూర్లో భీకర కాల్పులు.. 8 మంది మృతి, భారీగా పేలుడు పదర్థాలు స్వాధీనం
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. భద్రతా బలగాలు, కుకీ మిలిటెంట్ల మధ్య భీకర ఎన్కౌంటర్లో జరిగింది. ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది. బిష్ణుపూర్, చురచంద్పూర్ జిల్లాల్లో ఆగస్ట్ 29 నుంచి కాల్పుల మోత మోగుతోంది. రెండు తెగల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం అట్టుడికిపోతోంది. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం భద్రతా బలగాలు, కుకీ అతివాదులకు మధ్య ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బిష్ణుపూర్ జిల్లాలోని తమనాపోక్పి వద్ద జరిగిన ఘటనలో 8 మంది మరణించారు. మరో 18 మందికిపైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఆరుగురు కుకీ ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ఇద్దరు భద్రతా బలగాలకు చెందిన సిబ్బంది ఉన్నారు.
ఆగస్ట్ 31న చురచంద్పూర్లోని పలు ప్రాంతాలు పూర్తి బంద్
మరోవైపు దోపిడీకి గురైన ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు మణిపూర్ పోలీసులు, కేంద్ర భద్రతా దళాల బృందాలు గాలిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఆగస్ట్ 31న చురచంద్పూర్లోని ప్రాంతాలు పూర్తి బంద్ పాటించాయి. గడిచిన 24 గంటల్లో సెర్చ్ ఆపరేషన్లో భాగంగా భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. కాంగ్పోక్పి, తౌబాల్, చురచంద్పూర్.ఇంఫాల్ పశ్చిమ జిల్లాల్లోని పలు ప్రాంతాలలో పోలీసుల ఆపరేషన్ కొనసాగుతోంది. ఆయా ప్రాంతాల్లో భద్రతా బలగాలు దాడులు నిర్వస్తోంది.ఈ మేరకు ఐదు ఆధునిక ఆయుధాలు సహా 31 రౌండ్ల మందుగుండు సామగ్రి, 19 పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు ఎదుర్కోలేదని అస్సామ్ రైఫిల్స్ డీజీ పీసీ నాయర్ ఆందోళన వ్యక్తం చేశారు.