LOADING...
Online Gaming Bill: ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం 
ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Online Gaming Bill: ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2025
05:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభ ఆన్‌లైన్‌ గేమింగ్‌ నిర్వహణపై నిషేధాన్ని ప్రతిపాదించే కీలక బిల్లును ఆమోదించింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్‌ను 'ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్రమోషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ బిల్లు-2025' అని పిలుస్తున్నారు. ఈ బిల్లును కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లకు కొంతమంది వ్యక్తులు బానిసైపోవడం, మనీ లాండరింగ్‌, ఆర్థిక మోసాల వంటి అక్రమ కార్యకలాపాలు ఇటీవల గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, ఆన్‌లైన్‌ గేమింగ్‌ను నియంత్రించడం అవసరమని ప్రభుత్వం భావించింది.

వివరాలు 

ఆన్‌లైన్‌ మనీ గేమ్స్‌ ఆడేవారిని బాధితులుగా పేర్కొన బిల్లు 

ఈ బిల్లు ఆన్‌లైన్‌ గేమ్స్,ఈ-స్పోర్ట్స్‌ మధ్య స్పష్టమైన వర్గీకరణను చూపే విధంగా రూపొందించబడింది. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్‌లైన్‌ గేమ్స్‌ అందిస్తున్న వారికి మూడేళ్ల వరకు జైలుశిక్ష, లేదా రూ.కోటి వరకు జరిమానా, లేదా ఆ రెండూ విధించాలని ప్రతిపాదించారు. అదనంగా, సంబంధిత ఆన్‌లైన్‌ గేమింగ్‌, అడ్వర్టైజ్‌మెంట్‌ కార్యక్రమాలలో భాగంగా ఉన్నవారికి గరిష్ఠంగా రెండు సంవత్సరాల జైలుశిక్ష లేదా 50 లక్షల రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. ఈ లావాదేవీలలో నేరుగా పాలుపంచుకున్నవారికి గరిష్ఠంగా మూడు సంవత్సరాల జైలుశిక్ష, లేదా ఒక కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఆన్‌లైన్‌ మనీ గేమ్స్‌ ఆడేవారిని నేరస్థులుగా కాకుండా బాధితులుగా ఈ బిల్లులో పేర్కొన్నారు.

వివరాలు 

బిల్లు కారణంగా గేమింగ్‌ రంగానికి తీవ్ర నష్టం

మరోవైపు.. ఈ బిల్లు కారణంగా తమ రంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆల్‌ ఇండియా గేమింగ్‌ ఫెడరేషన్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు లేఖ రాసింది. గేమింగ్‌పై నిషేధం విధించే కంటే.. నియంత్రణ ఉంచాలని సూచించింది.