Page Loader
Operation Sindoor: మే 7 తర్వాత.. సరిహద్దు రాష్ట్రాల నుంచి పాక్‌కు చాటింగ్‌లు.. ఈమెయిల్స్‌పై నిఘా..! 
మే 7 తర్వాత.. సరిహద్దు రాష్ట్రాల నుంచి పాక్‌కు చాటింగ్‌లు.. ఈమెయిల్స్‌పై నిఘా..!

Operation Sindoor: మే 7 తర్వాత.. సరిహద్దు రాష్ట్రాల నుంచి పాక్‌కు చాటింగ్‌లు.. ఈమెయిల్స్‌పై నిఘా..! 

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2025
01:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపరేషన్ సిందూర్‌ ప్రారంభమైనప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌తో పాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల నుంచి పాకిస్థాన్‌కు వెళ్లుతున్న కమ్యూనికేషన్లపై కేంద్ర నిఘా సంస్థలు తమ దృష్టి సారించాయి. ఈ క్రమంలో అనుమానాస్పదంగా భావించిన ఫోన్ సంభాషణలు, చాటింగ్‌లు, ఈమెయిల్స్, సందేశాల వంటి సమాచారాన్ని విశ్లేషించడం ప్రారంభించాయి. ముఖ్యంగా భారత్‌లోనే ఉండి ఉగ్రవాదులకు సహకరిస్తున్న స్లీపర్ సెల్స్ వంటి గూఢచర్య వ్యవస్థల వివరాలను గుర్తించడం దీని ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో,ఈమెయిల్స్, టెలిఫోన్ కాల్స్,మెసేజ్‌లు,చాటింగ్‌లు వంటి కమ్యూనికేషన్ మార్గాలతో పాటు,ఎన్‌క్రిప్టెడ్ అప్లికేషన్లు,ప్రముఖ సోషల్ మీడియా యాప్‌లలో జరిగే కమ్యూనికేషన్ల వాల్యూమ్‌ను ఆధారంగా చేసుకుని విశ్లేషణ చేపట్టారు.

వివరాలు 

అనుమానాస్పద కదలికలు ఉన్నవారిని అరెస్టు చేసి విచారణ చేపడతాం

ఆపరేషన్ సిందూర్‌లో తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన తరువాత, భారత్‌లోని ఉగ్రవాద అనుకూలులు తమ హ్యాండ్లర్లు లేదా ఐఎస్‌ఐ ఆపరేటివ్‌లతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నారు అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. "ఉగ్రవాద సంస్థలు లేదా వాటి హ్యాండ్లర్లతో ఎవరైనా సంబంధంలో ఉన్నారో అనేది గుర్తించడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యం.మే 7 తర్వాత అనుమానాస్పద కదలికలు ఉన్నవారిని అరెస్టు చేసి విచారణ చేపడతాం," అని ఒక సీనియర్ భద్రతా అధికారి ఒక ఆంగ్ల దినపత్రికకు వివరించారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులు భద్రతా దళాల కదలికలు,ఆయుధాల సమాచారం వంటి సున్నిత విషయాలను పాకిస్తాన్‌కు చేరవేశారా అనే అంశంపై కూడా నిఘా ఉన్నట్లు పేర్కొన్నారు.

వివరాలు 

పాకిస్తాన్ నిఘా సంస్థలకు కీలకమైన సమాచారం అందించిన నిందితులు 

దీనివల్ల ఇప్పటి వరకూ భద్రతా వ్యవస్థలకు కనిపించకుండా ఉన్న ఓవర్‌ గ్రౌండ్ వర్కర్ల (OGWs) నెట్‌వర్క్‌ను గుర్తించడానికి ఈ చర్యలు ఉపయోగపడుతాయని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌తో సంబంధాలున్న గూఢచర్య నెట్‌వర్క్‌పై అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. కేవలం రెండు వారాల వ్యవధిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. వారిలో పంజాబ్‌లో ఆరుగురు, హర్యానాలో ఐదుగురు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగాయని అధికారులు తెలియజేశారు. అరెస్టు చేసిన నిందితులు పాకిస్తాన్ నిఘా సంస్థలకు కీలకమైన సమాచారం అందించినట్లు ఇప్పటికే కొనసాగుతున్న దర్యాప్తులో తేలిందని వెల్లడించారు.