PM Modi : నేడు, రేపు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఇదే
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ప్రధాని మోదీ సోమవారం, మంగళవారం తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ ఈ రెండురోజుల్లో అదిలాబాద్, సంగా రెడ్డి జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సోమవారం అదిలాబాద్ జిల్లాలో, మంగళవారం సంగారెడ్డి జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. ఈ రెండు జిల్లాల్లో కలిపి మోదీ మొత్తం 15,718కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రధాని మోదీ వరుస పర్యటనలు బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రధాని మోదీ తెలంగాణ వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్కు వెళ్లారు.
మోదీ షెడ్యూల్
ప్రధాని మోదీ సోమవారం ఉదయం బయల్దేరి 10.20గంటలకు మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి అదిబాద్కు చేరుకుంటారు. ఉదయం 11గంటల వరకు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. అనంతరం ప్రధాని మోదీ నాందేడ్కు వెళ్లి అక్కడి నుంచి నేరుగా చెన్నై వెళ్లనున్నారు. చెన్నైలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి.. రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. మంగళవారం ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి సంగారెడ్డికి వెళతారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొని, మాట్లాడుతారు. ఆ తర్వాత మోదీ సంగారెడ్డి నుంచి ఒడిస్సాకు వెళ్లనున్నారు.