
Rain Alert: ఏపీకి వారం పాటు భారీ వర్ష సూచన.. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్ప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాకా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం పేర్కొంది.
ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
వచ్చే వారం రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
బుధవారం,గురువారం రోజుల్లో రాయలసీమ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
ముఖ్యంగా అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి తీవ్రమైన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అంతేకాక, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేసింది.
వివరాలు
మన్యం ప్రాంతంలో అత్యధికంగా 4.3 సెంటీమీటర్ల వర్షపాతం
ఇంకా ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో మన్యం ప్రాంతంలో అత్యధికంగా 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొంది.
ఈ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై అధికారులను సన్నద్ధంగా ఉండాలని ఆదేశించింది.
ఇక ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. మే నెలలోనే, సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే రుతుపవనాలు ప్రవేశించాయి.
వివరాలు
వ్యవసాయానికి అనుకూలంగా మారే అవకాశం
గత 16 సంవత్సరాల్లో ఇదే తొలిసారి ఇంత తొందరగా రుతుపవనాలు భారత దేశంలో అడుగుపెట్టిన సందర్భమని వాతావరణ శాఖ వివరించింది.
ఈ పరిణామంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ముందుగా ప్రారంభమవడం వల్ల పంటలు వేసే పనులు ప్రారంభించేందుకు వారు సన్నద్ధమవుతున్నారు.
ఇది వ్యవసాయానికి అనుకూలంగా మారే అవకాశముందని భావిస్తున్నారు.