Hyderabad Real Estate : రియల్ ఎస్టేట్ కంపెనీలకు షాక్.. ఎన్ని సంస్థలకు నోటీసులు ఇచ్చారో తెలుసా
తెలంగాణలో రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ మేరకు 13 రియల్ ఎస్టేట్ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా పలు రియల్ సంస్థలు వ్యవహరించాయని తాము గుర్తించినట్లు తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ఛైర్మన్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలోనే నిబంధనలకు తుంగలో తొక్కిన కారణంగా 13 రియల్ ఎస్టేట్ కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని రెరా ఛైర్మన్ ఎన్.సత్యనారాయణ స్పష్టం చేశారు. రెరా పర్మిషన్ ఉన్నప్పటికీ, రెరా కేటాయించిన అధికారిక నెంబర్ లేకుండా ప్రకటనలు జారీ చేస్తున్నాయన్నారు. దీంతో జేబీస్ నేచర్ వ్యాలీ, జేబీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థలకు నోటీసులు ఇచ్చామన్నారు.
ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇవే :
నీమ్స్ బోరో గ్రూప్, ఎక్స్లెన్స్ ప్రాపర్టీస్, ప్రెస్టీజ్ గ్రూప్ ప్రాజెక్ట్స్, సనాలీ గ్రూప్, అర్బన్ యార్డ్స్, హ్యాపీ డ్రీమ్ హోమ్స్, విరతా డెవలపర్స్, రివెండల్ ఫామ్స్, కావూరి హిల్స్, సెవెన్ హిల్స్, బుల్డాక్స్, సుమధుర ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థలు రెరా రిజిస్ట్రేషన్ లేకుండా మార్కెటింగ్ చేస్తున్నాయని గుర్తించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే నోటీసులు జారీ చేశామన్నారు. రిజిస్ట్రేషన్ లేకుండానే ఏజెంట్లుగా వ్యాపారం చేస్తున్న ముగ్గురికి షోకాజ్ నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. ఈ మేరకు 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటన ద్వారా హెచ్చరించారు.