పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి చుక్కెదురు.. స్టే పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
మోదీ ఇంటిపేరుపై చేసిన వివాదాస్పదమైన కామెంట్స్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ మేరకు పరువు నష్టం దావా కేసులో మరోసారి ఆయనకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది మార్చి 23న రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. సదరు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ రాహుల్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ పిటిషన్ ను కొట్టివేశారు. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ఇంటి పేరుపై రాహుల్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సూరత్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీపై నమోదైన కేసును విచారించిన కోర్టు,ఆయన్ను దోషిగా పేర్కొంటూ జైలు శిక్ష విధించింది.