
Shubhanshu Shukla: నేడు ప్రధాని మోదీని కలవనున్న స్పేస్ హీరో శుభాన్షు శుక్లా
ఈ వార్తాకథనం ఏంటి
అంతరిక్షంలో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ప్రవేశించిన తొలి భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. రోదసి యాత్ర ముగించుకొని స్వదేశంలోకి ఆయన తొలిసారి అడుగుపెట్టారు. ఈ సందర్బంగా నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలవబోతున్నారు. ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద ఉన్న ప్రధానమంత్రి నివాసంలో సాయంత్రం 5 గంటల నుంచి 5.30 మధ్య ఈ భేటీ జరగనుందని సంబంధిత వర్గాలు ధృవీకరించాయి.
వివరాలు
అక్టోబర్లో గగన్యాన్ మిషన్ శిక్షణలో..
యాక్సియం-4 మిషన్ విజయవంతంగా పూర్తయ్యాక శుభాన్షు శుక్లా భారత్ రావడం ఇదే మొదటిసారి. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో న్యూఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఇస్రో చైర్మన్ వీ. నారాయణన్ స్వయంగా స్వాగతం పలికారు. ఇక ఇవాళ మోదీతో సమావేశం అనంతరం శుభాన్షు లక్నోకు వెళ్ళనున్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో జరగనున్న నేషనల్ స్పేస్ డే కార్యక్రమాలలో పాల్గొన్న తర్వాత, అక్టోబర్లో ప్రారంభమయ్యే గగన్యాన్ మిషన్ శిక్షణలో భాగమవుతారు. ఈ ఏడాది జూన్లో జరిగిన యాక్సియం-4 మిషన్లో భాగంగా శుభాన్షు శుక్లా బృందం అంతరిక్షానికి వెళ్లిన విషయం తెలిసిందే.
వివరాలు
41ఏళ్ల తరువాత అంతరిక్షంలో భారత జెండాను ఎగురవేసిన శుభాన్షు
ఈ మిషన్లో ఆయన చీఫ్ పైలట్గా బాధ్యతలు నిర్వర్తించారు.సుమారు 18 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపిన ఆయన 60కి పైగా శాస్త్రీయ పరిశోధనల్లో చురుకుగా పాల్గొన్నారు. జూలై 15న బృందం విజయవంతంగా భూమికి తిరిగి వచ్చింది.ఇలా శుభాన్షు శుక్లా,అంతరిక్షానికి వెళ్లిన రెండో భారత వ్యోమగామి గానే కాకుండా,ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే,1984లో సోవియట్ యూనియన్ నిర్వహించిన ఇంటర్కాస్మోస్ మిషన్ కింద సూయజ్ టీ-11 వ్యోమనౌకలో రాకేశ్ శర్మ తొలిసారిగా అంతరిక్షానికి వెళ్లారు. ఎనిమిది రోజులపాటు రోదసిలో గడిపి విజయవంతంగా తిరిగి వచ్చిన ఆయన తర్వాత,దాదాపు 41ఏళ్ల తరువాత శుభాన్షు మరోసారి భారత జెండాను అంతరిక్షంలో ఎగరేశారు.