Page Loader
Weather Report: ఏపీ, తెలంగాణలో ఎండలు విజృంభణ.. 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
ఏపీ, తెలంగాణలో ఎండలు విజృంభణ.. 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

Weather Report: ఏపీ, తెలంగాణలో ఎండలు విజృంభణ.. 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2025
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎండ వేడితోపాటు వడగాల్పులు కూడా తోడవ్వడంతో మధ్యాహ్నం బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో తీవ్ర ఎండల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తాజాగా రెడ్ అలర్ట్ ప్రకటించింది

Details

ఏపీలో తీవ్ర వడగాల్పులపై రెడ్ అలర్ట్ 

ఏపీలో గురువారం 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని, 199 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని APSDMA హెచ్చరించింది. శుక్రవారం 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 186 మండలాల్లో సాధారణ వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. శ్రీకాకుళం (13 మండలాలు), విజయనగరం (14), పార్వతీపురం మన్యం (11), అనకాపల్లి (2), కాకినాడ (4), తూర్పు గోదావరి (2), ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వడగాల్పులు తీవ్రమయ్యే అవకాశం ఉందని APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

Details

గడచిన 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 

బుధవారం సిద్ధవటంలో 40.8 డిగ్రీలు, కమ్మరచేడులో 40.7 డిగ్రీలు, నిండ్రలో 40.1 డిగ్రీలు, మంగనెల్లూరులో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడి నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దాహం వేయకపోయినా తరచూ నీరు తాగాలి, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ఓఆర్ఎస్, నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలను తీసుకోవాలి. వదులుగా, తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలి. నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయ, దోసకాయ, నారింజ వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

Details

 ఎండ వేళల్లో ఇవి చేయొద్దు 

మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు బయటకు వెళ్లడం వద్దు. అధిక శారీరక శ్రమ అవసరమైన పనులను దూరంగా ఉంచాలి. ఆల్కహాల్, టీ, కాఫీ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఉప్పు, కారం, నూనె అధికంగా ఉన్న ఆహారాన్ని మించుకు తినకూడదు. నిల్వ ఉన్న ఆహారం సేవించకూడదు.

Details

 దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత 

మార్చి ప్రారంభం నుంచే దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం తెలంగాణలోని నిజామాబాద్‌లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలో నంద్యాల జిల్లాలో 40 డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.