Page Loader
Supreme Court: వక్ఫ్ బిల్లు అమలుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు 
వక్ఫ్ బిల్లు అమలుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు

Supreme Court: వక్ఫ్ బిల్లు అమలుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 17, 2025
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

వక్ఫ్ బిల్లుతో సంబంధించి కేంద్ర ప్రభుత్వం యథాతథ స్థితిని కొనసాగించాలని భారత సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రధాన న్యాయవాది (అటార్నీ జనరల్) పూర్తి వివరణాత్మక నివేదికను సమర్పించేందుకు ఒక వారం గడువు కోరారు. ఈ సమయంలో వక్ఫ్ బిల్లులో ఎటువంటి మార్పులు చేయకూడదని ఆయన తెలిపారు. ఈ మేరకు స్పందించిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణ వరకు బిల్లులో ఎటువంటి మార్పులు చేయకూడదని, చట్టపరమైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేసింది. అంతేకాక, వక్ఫ్ చట్టానికి సంబంధించి ప్రస్తుత స్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వివరాలు 

కేంద్రం తరపున తుషార్ మెహతా వాదనలు 

కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఆయన మాట్లాడుతూ, ఈ బిల్లులో అనేక సవరణలు ఉన్నాయని, పలు కమిటీలను ఏర్పాటు చేసిన విషయాన్ని తెలిపారు. లక్షలాది అభ్యర్థనలు కూడా వచ్చాయని చెప్పారు. గ్రామాలన్నీ వక్ఫ్ ఆస్తులుగా గుర్తించబడటంతో పాటు, వ్యక్తిగత ఆస్తులను కూడా వక్ఫ్ పరిధిలోకి తీసుకున్నారన్న ఆరోపణలపై ఆయన శ్రద్ధ చూపించారు. ఈ పరిణామాలు ప్రజలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఇటువంటి స్థితిలో నేరుగా గానీ, పరోక్షంగా గానీ స్టే ఇవ్వడం కఠినమైన అంశమని అభిప్రాయపడ్డారు. కాబట్టి, వారం రోజుల గడువు ఇవ్వాలని, తన వాదనలతో పాటు ఆధారాలుగా డాక్యుమెంట్లను సమర్పించేందుకు అనుమతించాలని ధర్మాసనాన్ని కోరారు.

వివరాలు 

చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు 

చీఫ్ జస్టిస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, సర్వసాధారణంగా పరిస్థితి మారకూడదన్న అభిప్రాయంతోనే తాము ఉన్నామని పేర్కొన్నారు. బిల్లులో ఐదేళ్ల వరకు ప్రొవిజెన్స్ ఉన్నాయని తామికి తెలుసని తెలిపారు. వాటిని నిలిపివేయడం తమ ఉద్దేశమేం కాదని తేల్చిచెప్పారు. దయచేసి తమ వాదనను సవినయంగా వినాలని ఆయన కోరారు. అలాగే వారం రోజుల్లో ఎటువంటి మార్పు ఉండదని తుషార్ మెహతా పేర్కొనడంతో, ధర్మాసనం సైతం ఆమోదించింది. ఈ వ్యవధిలో ఎలాంటి నియామకాలు చేయకూడదని కూడా పేర్కొన్నారు. అలాగే, ఏ రాష్ట్రం అయినా నియామకాలు చేస్తే అవి చట్టబద్ధమైనవిగా పరిగణించబోమని హెచ్చరించారు.

వివరాలు 

తదుపరి విచారణ వరకు మార్పులకు నో చెప్పిన ధర్మాసనం 

కౌంటర్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు వారం రోజుల గడువు ఇచ్చింది. తదుపరి విచారణ తేదీ వరకు ఎటువంటి నియామకాలు చేయవద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాక, యూజర్ వక్ఫ్‌గా గుర్తించబడిన ఆస్తులతో పాటు, నోటిఫికేషన్ ద్వారా రిజిస్టర్ చేయబడ్డ ఆస్తులను డీ నోటిఫై చేయకూడదని తేల్చి చెప్పింది.