
Air India plane crash: విమాన ప్రమాద బాధితుల కోసం టాటా గ్రూప్ రూ.500 కోట్లతో ట్రస్ట్..!
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నేపథ్యంలో టాటా గ్రూప్ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థికంగా తోడుగా ఉండేందుకు, ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని టాటా సన్స్ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి బోర్డు అనుమతి కోరినట్టు సమాచారం. ఈ ట్రస్ట్ ఏర్పాటుకు రూ.500 కోట్లను కేటాయించేందుకు అనుమతి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. జూన్ 12న ఈ విషాద ఘటన జరిగిన అనంతరం, గురువారం నిర్వహించిన తొలి బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనను చర్చకు తీసుకువచ్చారు.
వివరాలు
ట్రస్ట్కు టాటా మోటార్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పీబీ బాలాజీ నాయకత్వం
అధికార వర్గాల వివరాల ప్రకారం,ఈ ట్రస్ట్కు కేటాయించే నిధుల ద్వారా ప్రమాదంలో మృతి చెందిన 271 మందికి చెందిన కుటుంబాలకు పరిహారాన్ని అందజేయనున్నారు. అంతేకాకుండా, గాయపడినవారి చికిత్స ఖర్చులు,ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజీ పునరుద్ధరణ, అలాగే విమాన శకలాల వల్ల దెబ్బతిన్న భవనాలను పునర్నిర్మించటం వంటి కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా చేపట్టనున్నారు. మిగిలిన నిధులను బాధిత కుటుంబాల భవిష్యత్ అవసరాల కోసం వినియోగించాలనే యోచన టాటా సంస్థకు ఉన్నట్టు సమాచారం. ఈ ట్రస్ట్ను త్వరలోనే అధికారికంగా నమోదు చేసి,దేశం,విదేశాల్లో ఉన్న బాధితుల కుటుంబాలకు నేరుగా ఆర్థిక సాయం అందించే ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈట్రస్ట్కు నాయకత్వం వహించే బాధ్యతను టాటా మోటార్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పీబీ బాలాజీ చేపట్టనున్నారు.
వివరాలు
విమానం కూలిన వెంటనే.. 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో విస్తృతంగా మంటలు
జూన్ 12న ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ తరహాకు చెందిన విమానం అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరింది. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్ విమానాశ్రయంనుంచి టేక్ఆఫ్ అయిన ఈ విమానం కొద్ది నిమిషాల్లోనే ఓ భవనం మీద కుప్పకూలింది. విమానం కూలిన వెంటనే దాదాపు 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో విస్తృతంగా మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో ఆ విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 242 మంది ఉన్నారు. వారిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒకరు మాత్రమే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.
వివరాలు
ఘోర ప్రమాదంలో 270 మందికిపైగా మృతి
ఇంకా విమానం కూలిన భవనం ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ కావడంతో, ఆ హాస్టల్లో ఉన్న కొంతమంది మెడికల్ విద్యార్థులు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఈ ఘోర ప్రమాదంలో 270 మందికిపైగా మృతి చెందారు. ఈ విషాదకర ఘటనను టాటా గ్రూప్ అత్యంత గంభీరంగా పరిగణించింది. ఈ ఘటన సంస్థకు పెద్ద సవాలుగా మారిన నేపథ్యంలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రయాణికుల భద్రత, విమానాల నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, ప్రభుత్వంతో సంబంధాలు వంటి ముఖ్య అంశాలను ఆయన నేరుగా పర్యవేక్షించనున్నట్టు సమాచారం.