పాట్నాలో జరిగే ప్రతిపక్ష నేతల సమావేశానికి కేసీఆర్ను ఆహ్వానించలేదు: తేజస్వీ యాదవ్
ఈ నెల 23న పాట్నాలో జరిగే బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతల సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ వెల్లడించారు. సమావేశానికి ప్రతిపక్ష నాయకులందరూ స్వయంగా హాజరు కావాలని, ప్రతినిధులను పంపవద్దని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మినహా, మిగతా 15 ప్రతిపక్ష పార్టీల అధినేతలు ఈ సమావేశానికి హాజరవుతారని తేజస్వీ ధృవీకరించారు. కేసీఆర్తో తాము మాట్లాడలేదన్నారు. అందుకే ఆయన హాజరుకాకపోవచ్చని చెప్పారు.
ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చేందుకే ఈ సమావేశం
రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, హేమంత్ సోరెన్, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, ఎంకే స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, డి.రాజా, సీతారాం ఏచూరి, దీపాంకర్ భట్టాచార్య ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు జేడీయా జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ 'లాలన్' ప్రకటించారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తేవడానికి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 2024 లోక్సభ ఎన్నికలలో పోరాడటానికి బీజేపీ భయపడుతోందని తేజస్వి యాదవ్ అన్నారు.