Telangana Governor : అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై కీలక ప్రసంగం.. ఇది ప్రజా ప్రభుత్వం, మాది ప్రజల పాలన
తెలంగాణ కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు శాసనసభలో ఉభయ సభలను ఉద్దేశించి శుక్రవారం ప్రసంగించారు. ఈ క్రమంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలను అభినందించిన గవర్నర్, ఇది ప్రజా ప్రభుత్వం అని, మా పాలన దేశానికే ఆదర్శం కానుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కొత్త ప్రభుత్వం నెరవేర్చాలని ఆమె ఆకాంక్షించారు. తమ జీవితాల్లో మార్పు రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారన్నారు. దీంతో మార్పు కోసం స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు.అణచివేత, అప్రజాస్వామిక పోకడలను ప్రజలు సహించరన్నారు. ప్రజల ఫిర్యాదులను స్వీకరించేందుకే ప్రజావాణి నిర్వహిస్తున్నామన్నారు.జనం ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తామని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రజా కవి కాళోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్, దాశరథి సూక్తులతో ముగించారు.
మాది సామాన్యుడి ప్రభుత్వం : గవర్నర్
'సామాన్యుడి ప్రభుత్వం' తెలంగాణ ప్రజలు తమ జీవితాల్లో మార్పు రావాలని కోరుకున్నారని, ఇది పేదల ప్రభుత్వమని గర్వంగా చెప్పే పరిస్థితి ఉందని గవర్నర్ అన్నారు. 4 కోట్ల ప్రజా ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణ, అమరవీరుల ఆకాంక్షల మేరకు పాలన సాగిస్తామన్నారు. స్వరాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన వారికి నివాళులు అర్పిస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమం కోసమే 6గ్యారెంటీలను ప్రకటించామన్నారు. ప్రతి ఆడబిడ్డను మహాలక్ష్మిగా మలచాలన్నదే మా ప్రభుత్వ ఆలోచన అన్నారు.బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే 2గ్యారెంటీలు అమలు చేశామన్నారు.వచ్చే 100 రోజుల్లో మిగతా 4 గ్యారెంటీలను సైతం అమలు చేస్తామని తమిళిసై చెప్పుకొచ్చారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు మా సర్కారు కట్టుబడి ఉందని,ధరణి స్థానంలో అత్యంత పారదర్శకమైన భూమాత పోర్టల్ తీసుకొస్తామన్నారు.
6 నెలల్లో మెగా డిఎస్సీ
ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని, అసైన్డ్, పోడు భూములకు త్వరలోనే పట్టాల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామన్నారు. కొత్త ఇల్లు నిర్మించుకునే పేదలకు రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నామని గవర్నర్ ప్రకటించారు. అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం, గౌరవ భృతి అందిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీపైనా కీలక ప్రకటన చేశారు. 6 నెలల్లో మెగా డీఎస్సీ వచ్చే 6 నెలల్లో మెగా డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. టీఎస్పీఎస్సీ వ్యవస్థ ప్రక్షాళనకు ఇప్పటికే కార్యచరణ ప్రారంభించామన్నారు.