
Omar Abdullah: 'కశ్మీర్లో పర్యాటకాన్ని ఉగ్రవాదం ఆపదు': పహల్గామ్లో ఒమర్ అబ్దుల్లా
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించిన విషయం తెలిసిందే.
ఈ దారుణ ఘటన జరిగిన ప్రదేశంలోనే ఇప్పుడు ప్రత్యేక క్యాబినెట్ సమావేశం నిర్వహించడం గమనార్హం.
ఉగ్రవాదుల పిరికిపంద చర్యలకు తమ ప్రభుత్వం భయపడదన్న సంకేతాన్ని ఇచ్చే ఉద్దేశంతో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఈ సమావేశానికి శ్రీకారం చుట్టింది.
తమ పాలనలో, వేసవి రాజధాని అయిన శ్రీనగర్ లేదా శీతాకాల రాజధాని అయిన జమ్ము కాకుండా, మంత్రులు ఇతర ప్రదేశంలో సమావేశమవడం ఇదే తొలిసారి అని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.
వివరాలు
ప్రజల ధైర్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం
పహల్గాం సమీపంలోని బైసరన్ అనే ప్రదేశంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడి అనంతరం పర్యాటకుల రాక లోపించడంతో, ఆ ప్రభావాన్ని ఎదుర్కొంటున్న స్థానికులకు మద్దతుగా, పర్యాటకాన్ని మళ్లీ ప్రోత్సహించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించామని సీఎం మీడియాకు తెలిపారు.
''ప్రజల ధైర్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మేము పహల్గాం వచ్చాం. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతాయి'' అని ఆయన పేర్కొన్నారు.
పహల్గాం క్లబ్లో జరిగిన ఈ సమావేశానికి సంబంధించిన దృశ్యాలను 'ఎక్స్' (మాజీ ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు.
వివరాలు
రాజౌరీ, పూంఛ్ వంటి ప్రదేశాల్లో క్యాబినెట్ సమావేశాలు
''ఉగ్రవాదుల పిరికిపంద చర్యలు భయపడేదిలేదనే స్పష్టమైన సందేశం ఇవ్వడమే మా ఉద్దేశ్యం. జమ్మూ కశ్మీర్ దృఢంగా నిలుస్తుంది'' అని ఆయనే ఆ పోస్ట్లో పేర్కొన్నారు.
తాను 2009 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఉత్తర కశ్మీర్లోని గురెజ్, మచిల్, తాంగ్ధర్, అలాగే జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ, పూంఛ్ వంటి ప్రదేశాల్లో క్యాబినెట్ సమావేశాలు నిర్వహించిన అనుభవాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా ఇక్కడ నిర్వహించాలని తమ ప్రభుత్వం కోరుతోందని తెలిపారు.
ఇలాంటి చర్యల ద్వారా ప్రజలలో ఉన్న భయాలను పోగొట్టవచ్చన్న నమ్మకం తమకుందని సీఎం స్పష్టం చేశారు.