
New flight services: ఏపీ నుంచి మూడు కొత్త విమాన మార్గాలు..అబుదాబి, బెంగళూరు,భువనేశ్వర్కు డైరెక్ట్ సర్వీసులు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రానికి చెందిన పలు కీలక ప్రాంతాల నుంచి దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారికంగా ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. విశాఖపట్నం - అబుదాబి మధ్య నేరుగా విమాన సర్వీసులు జూన్ 13నుంచి ప్రారంభం కానున్నాయని ఆయన వెల్లడించారు.
ఈ ఫ్లైట్స్ వారానికి నాలుగు రోజులు నడవనున్నాయని వివరించారు. ఇది అంతర్జాతీయ కనెక్టివిటీ విషయంలో విశాఖకు పెద్ద ఆస్తిగా నిలవనుంది.
Details
విజయవాడ - బెంగళూరుకు జూన్ 2 నుంచి సర్వీసులు ప్రారంభం
ఇదే విధంగా విశాఖపట్నం - భువనేశ్వర్ మధ్య నేరుగా విమాన సర్వీసు జూన్ 12 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.
ఇది ఆంధ్రప్రదేశ్ - ఒడిశా రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
అలాగే విజయవాడ - బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు జూన్ 2 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు.
ఈ సర్వీసుల ద్వారా ఏపీ రాజధాని ప్రాంతానికి ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న బెంగళూరుతో మెరుగైన అనుసంధానం ఏర్పడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఈ మూడు రూట్లలో కొత్తగా ప్రారంభమయ్యే విమాన సర్వీసులు రాష్ట్ర ప్రజలకు ప్రయాణ సౌకర్యాన్ని అందించడమే కాకుండా, ఆర్థిక, వాణిజ్య సంబంధాలను కూడా ప్రోత్సహించనున్నాయి.