Udhayanidhi Stalin: ప్రధాని మోదీతో ఉదయనిధి స్టాలిన్ భేటీ.. 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్' కి ఆహ్వానం
తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్ గురువారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. డిఎంకె, బిజెపిల మధ్య వివాదానికి దారితీసిన 'సనాతన ధర్మానికి'కు వ్యతిరేకంగా చేసిన ప్రసంగం తర్వాత ఉదయనిధి ప్రధాని మోదీని కలవడం ఇదే తొలిసారి. ఈ సమావేశం సందర్భంగా, జనవరి 19 నుండి చెన్నైలో నిర్వహించనున్న'ఖేలో ఇండియా యూత్ గేమ్స్' ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఉదయనిధి స్టాలిన్ ఆహ్వానించారు. భారీ వర్షాలతో సతమతమైన తమిళనాడుకు వరదలో సహాయ,పునరావాస పనుల కోసం అదనపు కేంద్ర నిధులను వెంటనే విడుదల చేయాలని మంత్రి కోరారు.
రాహుల్ ను కలిసిన ఉదయనిధి
అలాగే,ఉదయనిధి స్టాలిన్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కూడా కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఉదయనిధి స్టాలిన్ తనకి తమ్ముడు లాంటి వాడని పేర్కొన్నారు. దేశం లౌకిక ధర్మాన్ని కాపాడటంలో ఇండియా కూటమి పురోగతి గురించి క్లుప్తంగా చర్చించామని చెప్పారు. ఈ వారం ప్రారంభంలో, తమిళనాడులో జరిగిన కాన్వొకేషన్, పబ్లిక్ ఈవెంట్కు హాజరైనప్పుడు ప్రధాని మోదీ సీఎం స్టాలిన్తో కలిసి వేదికను పంచుకున్నారు.