
UNSC: టీఆర్ఎఫ్పై ఆంక్షలు విధించేందుకు యూఎన్ఎస్సీ అంగీకారం
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి గురించి తెలిసిందే. ఈ దాడికి 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)' అనే ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాదులు బాధ్యత వహించారు. ఈ సంఘటన నేపథ్యంలో, TRFను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని (UNSC) భారత్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. TRFపై ఆంక్షలు విధించే ప్రక్రియను యూఎన్ఎస్సీ పరిగణనలోకి తీసుకుందన్న సమాచారం వెలువడింది. ఈ మేరకు అమెరికా ఇటీవలే TRFను విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించిన విషయం విదితమే.
వివరాలు
TRFపై ఆంక్షలు విధించాలనే యోచనలో యూఎన్ఎస్సీ
UNSCకు చెందిన పర్యవేక్షణ కమిటీ తన తాజా నివేదికలో TRF గురించి అధికారికంగా ప్రస్తావించింది. పహల్గామ్లో జరిగిన దాడికి సంబంధించిన ప్రాంత చిత్రం TRF తమ వెబ్సైట్లో ప్రచురించిందని ఆ నివేదిక స్పష్టం చేసింది. అలాగే,ఈ దాడి పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయ్బా (LeT) మద్దతు లేకుండా జరిగే అవకాశమే లేదన్న అభిప్రాయాన్ని కూడా ప్రస్తావించింది. ఈ సంఘటన వంటి ఘటనలు ప్రాంతీయ స్థాయిలో ఉద్రిక్తతలకు దారితీయవచ్చని హెచ్చరించింది. ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ప్రస్తుతం ఈ నివేదికను యూఎన్ఎస్సీకి చెందిన ఆంక్షల కమిటీ సమీక్షించనుంది. తదనంతరం TRFపై ఆంక్షలు విధించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాలు
ఏప్రిల్ 22న బైసరన్ లోయ వద్ద తీవ్రవాదుల దాడి
ఇది జరిగితే,అంతర్జాతీయ వేదికపై భారత్కు ఇది ఓ గొప్ప దౌత్య విజయం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈఏడాది ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో ప్రసిద్ధి గాంచిన బైసరన్ లోయ వద్ద తీవ్రవాదులు జరిపిన దాడిలో 26మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈదాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'కు చెందిన ఉగ్రవాదులు పాల్పడ్డారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ దాడిని అంతర్జాతీయంగా అనేక దేశాలు తీవ్రంగా ఖండించాయి.అనంతరం భారత్ "ఆపరేషన్ సిందూర్"ప్రారంభించి పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ధాటికి దిగింది. ఈచర్యలో అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.ఇంతలో,అమెరికా TRFను విదేశీ ఉగ్రవాద సంస్థ (FTO)గా ప్రత్యేక గుర్తింపు పొందిన అంతర్జాతీయ ఉగ్రవాదిగా (SDGT)గుర్తించింది. భారత్ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది.