భారతీయ ఖగోళ శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం; చిన్న గ్రహానికి అతని పేరు
భారతీయ ఖగోళ శాస్త్రవేత్త అశ్విన్ శేఖర్కు అరుదైన గుర్తింపు లభించింది. అమెరికాలోని అరిజోనాలో జరిగిన ఆస్టిరాయిడ్స్ కామెట్స్ మెటియోర్స్ కాన్ఫరెన్స్ 2023లో కేరళకు చెందిన అశ్విన్ శేఖర్ పేరును ఒక చిన్న గ్రహానికి పెట్టారు. ఈ పేరును ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్(ఐఏయూ) పెట్టింది. అశ్విన్ శేఖర్ (జ.1985) ఆధునిక కాలంలో భారతదేశం నుంచి వచ్చిన మొదటి ఉల్కా ఖగోళ శాస్త్రవేత్త అని ఐఏయూ పేర్కొంది. ఇప్పటి వరకు ఐదుగురు భారతీయులకు మాత్రమే ఈ గౌరవం దక్కింది. వారిలో నోబెల్ గ్రహీతలైన సుబ్రమణ్య చంద్రశేఖర్, సి.వి.రామన్తో పాటు గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్, అంతరిక్ష శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్, ఖగోళ శాస్త్రవేత్త కల్లాట్ వైను బప్పు ఉన్నారు.
అశ్విన్ శేఖర్ కి ఐఏయూ ప్రశంసలు
గ్రహశకలాలపై అశ్విన్ శేఖర్ ఎన్నో పరిశోధనలు చేసినట్లు ఐఏయూ ప్రశంసించింది. ఈ సందర్భంగా ఆయనకు ప్రశంసా ప్రత్రాన్ని అందజేశారు. అశ్విన్ ప్రస్తుతం ఫ్రెంచ్ ప్రభుత్వంలోని సైన్స్, టెక్నాలజీ & ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కింద వచ్చే పారిస్ అబ్జర్వేటరీకి అనుబంధ ఖగోళ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. తన వృత్తి ప్రధానంగా గ్రహశకలాలు, తోకచుక్కలు, ఉల్క ప్రవాహాల కక్ష్యల పరిణామాన్ని అధ్యయనం చేయడమని అశ్విన్ పేర్కొన్నారు. శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లను ఉపయోగించి భవిష్యత్తులో భూమిని ఢీకొనే ప్రమదాలను నివారించడానికి, తన పరిశోధనలు ఉపయోగపడుతాయని అశ్విన్ చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే, అశ్విన్ వంటి ఖగోళ శాస్త్రవేత్తలు భూమిపై పడే ఉల్కలు, గ్రహశకలాలు, తోకచుక్కలకు వ్యతిరేకంగా స్పందించే ప్రపంచంలోని మొదటి రక్షణ వ్యవస్థ అన్న మాట.