
Shubhanshu Shukla: అంతరిక్ష కేంద్రం, డ్రాగన్ క్యాప్సూల్ డాక్స్కు చేరుకున్న శుభాంశు శుక్లా బృందం
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం అంతరిక్ష పరిశోధన రంగంలో మరో గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. యాక్సియం-4 మిషన్ (Axiom Mission 4)లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla)తో పాటు మరో ముగ్గురు అంతరిక్షయాత్రికులు విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి ప్రవేశించారు. ఐఎస్ఎస్తో స్పేస్క్రాఫ్ట్ అనుసంధానమైన డాకింగ్ ప్రక్రియ సఫలమవడంతో, వారు కేంద్రంలోకి ప్రవేశించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మిషన్లో అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ-విస్నీవ్స్కీ, హంగరీకు చెందిన టిబర్ కపు వంటి అంతరిక్షయాత్రికులతో పాటు, భారతీయుడైన శుభాంశు శుక్లా ఫాల్కన్-9 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు.
వివరాలు
14 రోజులపాటు పరిశోధనలు
భారతీయ కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ ప్రయాణం ప్రారంభమైంది. గురువారం సాయంత్రం 4.03 గంటలకు వారి వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకుని, డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ నలుగురు వ్యోమగాములు తర్వాత ఐఎస్ఎస్లోకి ప్రవేశించి, అక్కడ 14 రోజులు తమ శాస్త్రీయ పరిశోధనల కోసం గడపనున్నారు.