Page Loader
X : సెన్సార్‌షిప్,ఐటీ చట్ట ఉల్లంఘన.. కేంద్ర ప్రభుత్వంపై ఎక్స్ దావా 
సెన్సార్‌షిప్,ఐటీ చట్ట ఉల్లంఘన.. కేంద్ర ప్రభుత్వంపై ఎక్స్ దావా

X : సెన్సార్‌షిప్,ఐటీ చట్ట ఉల్లంఘన.. కేంద్ర ప్రభుత్వంపై ఎక్స్ దావా 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2025
05:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ (X) సోషల్ మీడియా సంస్థ భారత ప్రభుత్వంపై కోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ దావాను కర్ణాటక హైకోర్టులో ఫైల్ చేసింది. భారత ప్రభుత్వం అక్రమంగా కంటెంట్ నియంత్రణ చేపడుతోందని, సెన్సార్‌షిప్‌కు పాల్పడుతోందని ఎక్స్ సంస్థ ఆరోపించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్ని ఉపయోగించే విధానంపై ఎక్స్ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎక్స్ సంస్థ ప్రకారం, భారత ప్రభుత్వం ఐటీ చట్టంలోని 79(3)(బీ) సెక్షన్‌ను అక్రమంగా ఉపయోగిస్తున్నదని పేర్కొంది. ఈ సెక్షన్ అమలు చేయడం ద్వారా సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నట్లు సంస్థ తన దావాలో తెలిపింది. అంతేకాకుండా, ఈ సెక్షన్ ద్వారా ఆన్‌లైన్‌లో భావస్వేచ్ఛను అడ్డుకుంటున్నట్లు కూడా ఆరోపించింది.

వివరాలు 

సెక్షన్ 69ఏను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వం

ప్రభుత్వం 79(3)(బీ)సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తోందని ఎక్స్ సంస్థ స్పష్టం చేసింది. దీనిద్వారా సహయోగ్ పోర్టల్‌ను సమాంతరంగా నడిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. సెక్షన్ 69ఏను ఉల్లంఘిస్తూ కంటెంట్ బ్లాకింగ్ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఎక్స్ సంస్థ ఆరోపించింది. 2015లో శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రం ఉల్లంఘిస్తోందని ఎక్స్ పేర్కొంది.

వివరాలు 

 కంటెంట్ బ్లాక్ చేయాలంటే.. 69ఏ సెక్షన్ 

ఎక్స్ ప్రకారం, కంటెంట్ బ్లాక్ చేయాలంటే అది న్యాయ ప్రక్రియ ద్వారా జరగాలి లేదా 69ఏ సెక్షన్ ప్రకారం ముందుకు సాగాలని సంస్థ పేర్కొంది. సెక్షన్ 79 ప్రకారం, అక్రమ కంటెంట్ ఉందని నిర్ధారిస్తే, కోర్టు లేదా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్‌లైన్ సంస్థలు దానిని తొలగించాల్సి ఉంటుంది. 36 గంటల్లో కంటెంట్ తొలగించని పక్షంలో, ఆ సంస్థ ఇండియన్ పీనల్ కోడ్ (IPC) ప్రకారం న్యాయ విచారణను ఎదుర్కొవాల్సి ఉంటుందని ఎక్స్ తన పిటీషన్‌లో వివరించింది.