Page Loader
Indian Astronaut On Moon: 2040 నాటికి చంద్రుడిపై భారత వ్యోమగామి.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఆశాభావం
2040 నాటికి చంద్రుడిపై భారత వ్యోమగామి..కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ ఆశాభావం

Indian Astronaut On Moon: 2040 నాటికి చంద్రుడిపై భారత వ్యోమగామి.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఆశాభావం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 09, 2025
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత వ్యోమగామి చంద్రుడిపై కాలుమోపే రోజు దూరంలో కాదు! చంద్రయాన్‌ శ్రేణి విజయవంతమైన ప్రయోగాల ద్వారా ప్రపంచానికి తన అద్భుత శక్తిని చాటిన భారత్‌, ఇప్పుడు మరింత ముందుకు సాగుతోంది. చంద్రుడిపై తన స్వంత వ్యోమగామిని దిగే రోజును లక్ష్యంగా పెట్టుకుని, భవిష్యత్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2040 నాటికి భారత వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెడతాడని, కేంద్ర విజ్ఞానశాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డా. జితేంద్ర సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 'రైజింగ్‌ భారత్‌ సమ్మిట్‌ 2025' అనే ఓ ఆంగ్ల టీవీ ఛానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, భారత్‌ అంతరిక్ష రంగ భవిష్యత్‌ ప్రణాళికలపై విశదీకరించారు.

వివరాలు 

భారత అంతరిక్ష రంగంలో మరో కీలకమైన మైలురాయి

2035 నాటికి దేశం తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని - భారత్‌ స్పేస్‌ స్టేషన్‌గా - నిర్మించనున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. ఇది భారత అంతరిక్ష రంగంలో మరో కీలకమైన మైలురాయి కానుంది. చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా, ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన విషయం తెలిసిందే. ఈ ఘనత భారత వైజ్ఞానిక సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి రుజువు చేసింది. దీంతో చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన నాలుగో దేశంగా భారత్‌ చరిత్రలో నిలిచింది. అంతేకాదు, చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన తొలి దేశంగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

వివరాలు 

వచ్చే సంవత్సరం గగన్‌యాన్‌

ఇప్పుడు ఈ విజయాన్ని కొనసాగిస్తూ చంద్రయాన్‌ 4 మిషన్‌పై ఇస్రో దృష్టి కేంద్రీకరించింది. చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్‌ ప్రధాన లక్ష్యం. 2027లో ఈ ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), ముందుగా ఎల్‌వీఎం-3 రాకెట్‌ను కనీసం రెండు మార్లు ప్రయోగించనుంది. ఈ ప్రయోగాల ద్వారా చంద్రయాన్‌-4 మిషన్‌కు సంబంధించిన ఐదు వేర్వేరు భాగాలను కక్ష్యలోకి పంపిస్తారు. అక్కడే అవన్నీ ఒకచోట చేర్చబడతాయి. భారత వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెట్టే దాకా చంద్రయాన్‌ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతాయని ఇస్రో ఇప్పటికే స్పష్టంచేసింది. మరోవైపు, దేశపు తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర అయిన గగన్‌యాన్‌ను వచ్చే సంవత్సరం ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.