Page Loader
IND vs PAK: గ్లోబల్ ఈవెంట్లలో ఇండియా-పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో తలపడవా?

IND vs PAK: గ్లోబల్ ఈవెంట్లలో ఇండియా-పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో తలపడవా?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 25, 2025
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు, భవిష్యత్తులో కూడా అలాంటి సిరీస్‌లను నిర్వహించే ప్రసక్తే లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ రెండు జట్లు కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే ఆడుతున్నాయి. గ్రూప్ స్టేజ్‌లో భారత్ - పాక్ మ్యాచ్‌లను ఉంచడం వల్ల టోర్నీకి మరింత ఆకర్షణ ఉంటుందనే ఉద్దేశంతోనే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకొనేది.

వివరాలు 

పాకిస్థాన్‌తో గ్రూప్ స్టేజ్‌లో భారత్ ఆడకూడదని వార్తలు

అయితే, ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి సంఘటన అనంతరం,పాకిస్థాన్‌తో గ్రూప్ స్టేజ్‌లో భారత్ అసలు ఆడకూడదని టీమిండియా భావిస్తోందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఐసీసీకి లేఖ రాసినట్లు కూడా సమాచారం వచ్చింది. భవిష్యత్తులో జరుగనున్న ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రధాన టోర్నీల్లో భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉండకుండా చూడాలని బీసీసీఐ సూచించిందని తెలుస్తోంది. కానీ ఈ విషయంలో బీసీసీఐ అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం, టాప్ బీసీసీఐ అధికారులు ఈ విషయంపై ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

వివరాలు 

పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలు నిలిపివేయాలని డిమాండ్లు

''దేశవ్యాప్తంగా ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలు నిలిపివేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ విషయంలో బీసీసీఐ టాప్ ఆఫీస్‌ బేరర్‌ ఒకరు మాట్లాడారు. చాలా సున్నితమైన అంశం కావడం వల్ల, చర్చించిన తరువాతే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ వార్తల్లో ఏ నిజం లేదని భావిస్తున్నా, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం'' అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.

వివరాలు 

ఇవి ఐసీసీ టోర్నీలు

ఈ ఏడాది ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ జరుగింది,దీనికి పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. భారత్‌కు చెందిన అన్ని మ్యాచులు దుబాయ్ వేదికపై నిర్వహించారు. చివరికి భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ సంవత్సరం ఐసీసీ ఈవెంట్స్‌లో పురుషుల విభాగంలో మరేదీ లేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఐసీసీ టోర్నీ కాకపోయినా, ఆసియా కప్ కూడా అభిమానులను ఆకట్టుకొనే టోర్నీగా ఉంది. భారతే ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచులను తటస్థ వేదికపై నిర్వహించాలని బీసీసీఐ మరియు ఏసీసీ భావిస్తున్నాయి. మహిళల ప్రపంచ కప్‌ సెప్టెంబర్- అక్టోబర్‌లో జరగనుంది. పాకిస్థాన్ కూడా అర్హత సాధించింది. భారత్‌తో జరగనున్న మ్యాచులను తటస్థ వేదికలపై నిర్వహిస్తారా లేదా రద్దు చేస్తారా అన్నది ఇంకా తెలియరాలేదు.