
IPL 2025: చీర్ లీడర్స్,డీజేలు లేకుండానే ఐపీఎల్ 2025 మిగతా మ్యాచ్లు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇటీవల ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుండగానే అర్ధంతరంగా నిలిపివేశారు. ఈ పరిణామంతో మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లను కూడా ఒక వారం పాటు వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, మే 10న భారత్,పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో, నిలిపివేసిన 17 మ్యాచ్లను మే 17 నుంచి తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది.
వివరాలు
ఆర్భాటాలు లేకుండా మ్యాచ్లు నిర్వహించాలి: గావస్కర్
ఈ ఘటనల నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ బీసీసీఐకి కీలక సూచన చేశాడు. మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లను డీజేలు లేదా చీర్ లీడర్స్ వంటి హంగులు లేకుండా నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డాడు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు గౌరవంగా ఈ నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నాడు. గావస్కర్ సూచనను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ, ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా మ్యాచ్లు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
వివరాలు
ఐపీఎల్ మళ్లీ ప్రారంభమయ్యే వేదికలు.. ముఖ్యమైన తేదీలు
ఐపీఎల్ మళ్లీ ప్రారంభమయ్యే మ్యాచ్ మే 17న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్తో పాటు మిగిలిన లీగ్ మ్యాచ్లు దిల్లీ, జైపుర్, అహ్మదాబాద్, ముంబయి, బెంగళూరు, లఖ్నవూ వంటి ఆరు వేదికలపై జరగనున్నాయి. లీగ్ దశ మే 27న ముగియనుండగా, మే 29న ప్లేఆఫ్స్ ప్రారంభమవుతాయి. ఫైనల్ పోరు జూన్ 3న జరగనుంది. అయితే, ప్లేఆఫ్స్కు సంబంధించి విదేశీ ఆటగాళ్లు పాల్గొనగలరా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సిన అంశంగానే ఉంది.