
IND vs ENG: ఇంగ్లండ్ టూర్లో టీమిండియాకు బిగ్ షాక్.. రిషబ్ పంత్కు గాయం!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియా-ఇంగ్లండ్ మధ్య జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సంబంధించి టీమిండియాకు ముందే షాక్ తగిలింది.
ఇప్పటికే భారత్ జట్టు ఇంగ్లాండ్ చేరి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కీలక ఆటగాడు గాయపడ్డాడు. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతని ఎడమచేతికి బంతి బలంగా తగలడంతో వెంటనే ఆటను మానేసి బయటకు వెళ్లాడు.
ఈసారి భారత జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, అనేకమంది యువ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.
అయితే, అనుభవజ్ఞులైన రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు ఈ పర్యటనలో కీలక పాత్ర పోషించనున్నారు.
Details
వైస్ కెప్టెన్ గా పంత్ బాధ్యతలు
పంత్ ఈ సిరీస్లో వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 6న టీమిండియా ఇంగ్లాండ్ చేరగా, జూన్ 7న లార్డ్స్ మైదానంలో ఫిట్నెస్ డ్రిల్స్ చేపట్టింది.
జూన్ 8న లండన్కు 15 కిలోమీటర్ల దూరంలోని బెకెన్హామ్లో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇక్కడ జట్టు పదిరోజుల పాటు ప్రాక్టీస్ చేయనుంది.
ఈ క్రమంలో ఆదివారం జరిగిన నెట్స్ సెషన్లో రిషబ్ పంత్ గాయపడ్డాడు. 'RevSportz' నివేదిక ప్రకారం, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి అతని ఎడమచేతికి బలంగా తగలడంతో తీవ్ర నొప్పి అనిపించింది.
Details
గాయం తీవ్రతపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది
వెంటనే బీసీసీఐ వైద్య బృందం అతన్ని పరిశీలించింది.
ప్రాథమికంగా ఐస్ ప్యాక్ వేశారు, తరువాత గాయం ఉన్నచోట కట్టు వేశారు.
అప్పటి నుంచి పంత్ ప్రాక్టీస్కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం పంత్ గాయం ఎంతవరకు తీవ్రంగా ఉందనేది అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
అయితే, టెస్టు సిరీస్ ప్రారంభానికి ఇంకా పదిరోజుల సమయం ఉండటంతో అతను పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని వర్గాలు భావిస్తున్నాయి.