Page Loader
Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీపై ఐసీసీ కీలక నిర్ణయం.. హైబ్రిడ్‌కు పచ్చజెండా!
ఛాంపియన్స్‌ ట్రోఫీపై ఐసీసీ కీలక నిర్ణయం.. హైబ్రిడ్‌కు పచ్చజెండా!

Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీపై ఐసీసీ కీలక నిర్ణయం.. హైబ్రిడ్‌కు పచ్చజెండా!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 06, 2024
08:33 am

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే ఏడాది పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ (2025) పై ఉన్న సందిగ్ధతను తొలగించేందుకు ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నీని హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించగా, భారత మ్యాచ్‌లకు వేదికగా దుబాయ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, 2027 వరకు జరగనున్న ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ జట్టు విషయంలోనూ హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించేందుకు ఐసీసీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాలు ఐసీసీ చైర్మన్ జై షా, ఇతర బోర్డు సభ్యుల మధ్య గురువారం జరిగిన అనధికార సమావేశంలో తీసుకున్నారని సమాచారం.

వివరాలు 

భారత మ్యాచ్‌లు దుబాయ్‌లో

2024 ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. అయితే, ఈ టోర్నీ కోసం భారత జట్టును పాకిస్థాన్‌కు పంపేది లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, టీమిండియా మ్యాచ్‌లను పాకిస్థాన్ వెలుపల నిర్వహించేందుకు హైబ్రిడ్ విధానాన్ని ప్రతిపాదించారు. మొదట ఈ ప్రతిపాదనకు పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఒప్పుకోకపోయినా, 2031 వరకు భారత్ ఆతిథ్యమిచ్చే లేదా సహ ఆతిథ్యమిచ్చే టోర్నీల్లో తమ జట్టు మ్యాచ్‌లను కూడా హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తామని ఐసీసీ హామీ ఇవ్వడంతో పీసీబీ చివరకు అంగీకరించింది. తాజాగా, ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో భారత మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయని స్పష్టమైంది.

వివరాలు 

శ్రీలంకతో కలిసి భారత్ 

ఇక 2024 అక్టోబర్‌లో జరగబోయే మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీలో పాకిస్థాన్ మ్యాచ్‌లు భారత్ వెలుపల జరిగే అవకాశముంది. 2026 పురుషుల టీ20 ప్రపంచకప్‌ను శ్రీలంకతో కలిసి భారత్ నిర్వహించనుంది. ఇందులో పాకిస్థాన్ మ్యాచ్‌లకు శ్రీలంక వేదికగా ఉండే అవకాశముంది. ''2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్,యూఏఈలో జరుగుతుంది. భారత్ మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహిస్తారు'' అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి.