టీమిండియాపై విషం చిమ్మిన పాకిస్తాన్ మాజీ ప్లేయర్
బీసీసీఐ పై పాకిస్తాన్ మాజీ ప్లేయర్ జావేద్ మియాందాద్ షాకింగ్స్ కామెంట్స్ చేశారు. పాకిస్థాన్ కి టీమిండియాను పంపేందుకు బీసీసీఐ ఒప్పుకోకపోతే, ఈ ఏడాది జరిగే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ కోసం భారత్కి పాక్ ఆటగాళ్లు వెళ్లకూడదని జావేద్ మియాందాద్ పేర్కొన్నారు. ఆసియా కప్-2023 నిర్వహణ వివాదం ముగిసి ఈ టోర్నీని సక్సెస్ చేసేందుకు పీసీబీ, ఎస్ఎల్సీ సన్మాహాలు చేస్తున్న వేళ అతను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. పీసీబీ కూడా ప్రతిదానికీ తలొగ్గుతూ దేశం పరువు తీస్తోందని వాపోయారు. 2012, 2016లో ఇండియాకి పాకిస్తాన్ వచ్చిందని, ఇప్పుడు టీమిండియా వంతు అని, అసియా కప్ కోసం పాకిస్తాన్ కి టీమిండియా ప్లేయర్లు రాకపోతే నరకానికి పోతారని మియాందాద్ వెల్లడించారు.
చివరిసారిగా పాక్ లో 2008లో పర్యటించిన టీమిండియా
తన నిర్ణయం ప్రకారం అయితే ఏ ఒక్క మ్యాచ్ ఆడటానికి కూడా తాను భారత్ కు వెళ్లనని, ఒకవేళ అది ప్రపంచ కప్ అయినా సరేనని, తాము టీమిండియాతో ఆడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని, కానీ భారత్ తమలాగా సానుకూల స్పందన ఉండదని మియాందాద్ వివరించారు. పాకిస్తాన్ క్రికెట్ చాలా పెద్దదని, తాము ఇప్పటికే చాలా మంది మెరుగైన ఆటగాళ్లను ప్రపంచ క్రికెట్కు పరిచయం చేశామని, కావున తాము భారత్ కు వెళ్లకపోతే తమకు కలిగే నష్టమేమీ లేదన్నారు. భారత్ చివరిసారిగా 2008లో ఆసియా కప్ కోసం పాకిస్తాన్ లో పర్యటించిన విషయం తెలిసిందే. ముంబైలో జరిగిన దాడులతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లు కూడా నిలిచిపోయాయి.