
Dream11: టీమిండియా ప్రధాన స్పాన్సర్షిప్ నుంచి తప్పుకున్న డ్రీమ్ 11..
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ ఫ్యాంటసీ గేమింగ్ సంస్థ డ్రీమ్ 11 అప్రతీతంగా టీమిండియా ప్రధాన స్పాన్సర్షిప్ ఒప్పందం నుండి అర్ధాంతరంగా వైదొలిగింది. మొత్తం రూ. 358 కోట్ల ఒప్పందాన్ని మధ్యలో రద్దు చేసినప్పటికీ, బీసీసీఐకి ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేకపోవడం గమనార్హం. ఈ అనూహ్య పరిణామానికి కారణంగా దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన ఆన్లైన్ గేమింగ్ చట్టం నిలిచింది. డ్రీమ్ 11 ప్రతినిధులు నేరుగా బీసీసీఐ కార్యాలయాన్ని సందర్శించి తమ నిర్ణయాన్ని సీఈఓ హేమాంగ్ అమిన్ కు తెలియజేశారు.
వివరాలు
కొత్త స్పాన్సర్ కోసం త్వరలో టెండర్లు పిలవనున్న బీసీసీఐ
బీసీసీఐలో ఉన్న ఒక ఉన్నతాధికారి మీడియాకు తెలిపినట్టుగా, "కొత్త చట్టం వల్ల మా స్పాన్సర్షిప్ కొనసాగించడం సాధ్యం కాకుండా వుంది. కాబట్టి రాబోయే ఆసియా కప్ కి డ్రీమ్ 11 స్పాన్సర్గా ఉండదు. త్వరలోనే కొత్త స్పాన్సర్ కోసం టెండర్లు పిలుస్తాము" అని ఆయన పేర్కొన్నారు. ఒప్పందంలోని షరతులు ప్రకారం, కొత్త చట్టం కంపెనీ ప్రధాన వ్యాపారంలో ఇబ్బందులు సృష్టిస్తే, డ్రీమ్ 11కు ఎలాంటి జరిమానా లేకుండా స్పాన్సర్షిప్ నుండి బయటపడే అవకాశం ఉంది. ఇదే కారణం, ఒప్పందాన్ని ముందే రద్దు చేసినా బీసీసీఐకు ఎలాంటి నష్టపరిహారం అవసరం లేకపోవడం. సమాచార ప్రకారం, 2023లో బైజూస్ స్థానంలో డ్రీమ్ 11 భారత జట్టు ప్రధాన స్పాన్సర్గా బాధ్యతలు స్వీకరించింది.
వివరాలు
2020లో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా డ్రీమ్ 11
ఈ పరిణామం కేవలం బీసీసీఐకి మాత్రమే కాకుండా, అంతర్జాతీయ క్రికెట్ పరిశ్రమపై కూడా ప్రభావం చూపుతుంది. డ్రీమ్ 11 ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీలతో పాటు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ క్రికెటర్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. గతంలో,ఇండియా-చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో వివో స్పాన్సర్గా ఉండకపోవడంతో 2020లో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా కూడా డ్రీమ్ 11 వ్యవహరించింది.
వివరాలు
పెరిగిపోతున్న మనీలాండరింగ్, పన్ను ఎగవేత వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు
అదనంగా,కరేబియన్ ప్రీమియర్ లీగ్,న్యూజిలాండ్ డొమెస్టిక్ టీ20 'సూపర్ స్మాష్' వంటి లీగ్లకు కూడా డ్రీమ్ 11 స్పాన్సర్. ఐపీఎల్ స్థాయిలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఈ లీగ్లు రాబోయే కాలంలో సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం, ఆన్లైన్ మనీ గేమింగ్ సేవల అనియంత్రిత విస్తరణ కారణంగా ఆర్థిక మోసాలు, మనీ లాండరింగ్, పన్ను ఎగవేత వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని, ఇవి దేశ భద్రతకు ముప్పుగా మారుతున్నాయని కొత్త ఆన్లైన్ గేమింగ్ బిల్లులో ప్రభుత్వం స్పష్టం చేసింది.