
Asia Cup: టీ20 ఆసియాకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ప్లేయర్ ఎవరో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ టీ20 చరిత్రలో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు ఎవరో తెలుసా? అతడు మరెవరో కాదు.. పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీనే. ఆసియా కప్ 2022లో, దుబాయ్ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం అని ఎవరు ఊహించి ఉండరు. రోహిత్ శర్మ అందుబాటులో లేని నాటి మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 61 బంతులలో 12 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 122 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో కోహ్లీకి ఇది వ్యక్తిగత తొలి సెంచరీగా నిలిచింది.
వివరాలు
101 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్
మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కోహ్లీ శతకంతో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు స్కోరు చేసింది. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 62 పరుగుల హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించిన అఫ్గాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి కేవలం 111 పరుగుల వద్ద ఆగిపోయింది. దీంతో భారత్ 101 పరుగుల భారీ తేడాతో గెలిచింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి దాదాపు మూడు సంవత్సరాలు సెంచరీ చేయలేదు. చివరిసారిగా అతను 2019 నవంబర్ 23న బంగ్లాదేశ్తో పింక్ బాల్ టెస్టులో శతకాన్ని సాధించాడు.
వివరాలు
రోహిత్ శర్మ రికార్డును అధిగమించిన కోహ్లీ
ఆ తర్వాతి కాలంలో యాభైల స్కోర్లు సాధించినప్పటికీ మూడు అంకెల రన్స్ చేయలేకపోయాడు, ఫలితంగా అతడి ఫామ్పై అనేక ప్రశ్నలు తలెత్తాయి. కానీ అఫ్గాన్తో మ్యాచ్లో వాటి అన్నింటికి కోహ్లీ తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. ఆ మ్యాచ్లో 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇది ఆ సమయంలో భారత జట్టు తరపున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. అతను రోహిత్ శర్మ 118 పరుగుల రికార్డును అధిగమించాడు.
వివరాలు
టీ20 ఆసియాకప్ చరిత్రలో (T20 Asia Cup) అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
* విరాట్ కోహ్లీ (భారత్) - 122 నాటౌట్ (2022లో అఫ్గానిస్తాన్ పై) * బాబర్ హయత్ (హాంగ్కాంగ్) - 122 (2016లో ఒమన్ పై) *రహ్మానుల్లా గుర్బాజ్ (అఫ్గానిస్థాన్) - 84 (2022లో శ్రీలంకపై) * రోహిత్ శర్మ (భారత్) - 83 (2016లో బంగ్లాదేశ్ పై)