Page Loader
IPL Coaches 2025: విరాట్ తర్వాతే టీ20 అరంగేట్రం.. ఇప్పుడు ఐపీఎల్‌లో కోచ్‌గా మారిన మాజీలు!
విరాట్ తర్వాతే టీ20 అరంగేట్రం.. ఇప్పుడు ఐపీఎల్‌లో కోచ్‌గా మారిన మాజీలు!

IPL Coaches 2025: విరాట్ తర్వాతే టీ20 అరంగేట్రం.. ఇప్పుడు ఐపీఎల్‌లో కోచ్‌గా మారిన మాజీలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 16, 2025
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్ అంచనాలకుమించి రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ సీజన్‌లో క్రికెట్ అభిమానులకు వినోదాన్ని అందించడమే కాదు, అనేక ఆశ్చర్యకరమైన పరిణామాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా, కొంతమంది భారత మాజీ క్రికెటర్లు ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కోచ్‌లుగా సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ తన టీ20 కెరీర్‌ను ప్రారంభించిన తర్వాతే టీ20 అరంగేట్రం చేసిన వారు, ఇప్పుడు కోచ్‌లుగా మారి జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Details

మునాఫ్ పటేల్ - ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ 

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తున్న మునాఫ్ పటేల్, 2010లలో టీమిండియాకు స్పీడ్‌స్టార్‌గా నిలిచాడు. భారత జట్టు తరఫున 70 వన్డేలు, 13 టెస్టులు, కేవలం 3 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మునాఫ్, కోహ్లీ టీ20 అరంగేట్రం (2010) తరువాతే ఈ ఫార్మాట్‌లోకి ప్రవేశించాడు. 2011లో మొదటి టీ20 ఆడి, అదే ఏడాది చివరిది కూడా ఆడేశాడు. ఆశించిన స్థాయిలో అవకాశాలు రాక, అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మునాఫ్, ఇప్పుడు కోచ్‌గా తన సత్తా చాటుతున్నాడు. అతని మార్గదర్శనంలో ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, విప్రజ్ నిగమ్‌లు బాగా రాణిస్తున్నారు.

Details

 పార్థీవ్ పటేల్ - గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కోచ్ 

భారత జట్టులో వికెట్ కీపర్‌గా సేవలందించిన పార్థీవ్ పటేల్ తన టీ20 కెరీర్‌లో కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. 2011లో వెస్టిండీస్, ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లలో విఫలమై జట్టులో నిలదొక్కుకోలేకపోయాడు. 2020లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పార్థీవ్, ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ యువ బ్యాటర్లకు సలహాలు అందిస్తున్నాడు.

Details

 రాహుల్ ద్రావిడ్ - రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ 

భారత క్రికెట్ చరిత్రలో అద్భుతమైన ఆటగాడు, శాంతమైన స్వభావం కలిగిన రాహుల్ ద్రావిడ్, ఒకే ఒక్క టీ20 మ్యాచ్‌లోనే భారత్ తరఫున ఆడాడు. 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌ అతని తొలి, చివరి టీ20 గేమ్‌గా నిలిచింది. టీ20 వరల్డ్ కప్ అనంతరం భారత జట్టు హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసిన ద్రావిడ్, ఇప్పుడు ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్‌కు హెడ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఈ మాజీ క్రికెటర్లు కోచ్‌లుగా మారి, యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ, ఫ్రాంచైజీల విజయాలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వారు కోచ్‌లుగా చేస్తున్న కృషి జట్ల విజయాల పునాది అవుతోంది.