
Israel Iran conflict: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. పశ్చిమాసియా వ్యాప్తంగా గగనతలాలపై ఆంక్షలు.. చిక్కుకుపోయిన వేలాదిమంది ప్రయాణికులు
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అత్యంత తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో, పశ్చిమాసియాలోని దేశాలు కీలక చర్యలకు పాల్పడుతున్నాయి.
ఈ పరిణామాల మధ్య, ఇజ్రాయెల్ వరుస క్షిపణి దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో, ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది.
దీనితో పాటు, లెబనాన్, జోర్డాన్, ఇరాక్ వంటి దేశాల్లో కూడా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.
గగనతలాలపై ఆంక్షలు విధించడమే కాక, పశ్చిమాసియా మొత్తం ఎయిర్పోర్టులు మూతపడటంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు.
గగనతలాల మూతల వల్ల ప్రయాణికులకు తీవ్ర అవస్థలు ఎదురవుతున్నాయి.
ఈ పరిస్థితిపై విమానయాన భద్రతా నిపుణుడు, రిటైర్డ్ పైలట్ జాన్ కాక్స్ స్పందిస్తూ, దాదాపు 10,000 మందికిపైగా ప్రయాణికులు ఇరాన్తో పాటు పశ్చిమాసియాలోని పలు ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు వెల్లడించారు.
వివరాలు
టెహ్రాన్లోని మెహ్రాబాద్ విమానాశ్రయం లక్ష్యంగా బాంబు దాడులు
ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఉన్న ఖొమేని అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం నుంచి విమానాల రాకపోకలు నిలిపివేశారు.
శనివారం రోజున ఇజ్రాయెల్ దళాలు టెహ్రాన్లోని మెహ్రాబాద్ విమానాశ్రయం లక్ష్యంగా బాంబు దాడులు జరిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ పరిణామాల మధ్య, ఇజ్రాయెల్ తన దేశంలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా మూసివేసింది.
ఈ నిర్ణయంతో 50,000 మందికిపైగా ఇజ్రాయెల్ పౌరులు విదేశాల్లోనే ఉండిపోయినట్లు సమాచారం.
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటంతో,ఇరాన్కు చెందిన మూడు విమానయాన సంస్థల విమానాలను లార్నాకా నగరానికి తరలించారు.
వివరాలు
ఇజ్రాయెల్ ప్రధాని కీలక ఆదేశం
అదేవిధంగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ కీలక ఆదేశం జారీ చేస్తూ, జోర్డాన్, ఈజిప్ట్తో ఉన్న సరిహద్దుల ద్వారా తమ పౌరులు దేశం విడిచి వెళ్లవద్దని హెచ్చరించారు.
ఆ మార్గాల్లో ప్రమాదం పొంచి ఉన్న అవకాశముందని ఆయన అన్నారు.
లెబనాన్, జోర్డాన్ దేశాల్లో గగనతలాలు ప్రస్తుతం పాక్షికంగా మాత్రమే తెరిచి ఉన్నప్పటికీ, అక్కడి విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు తెలిపారు.
అనేక విమానాలు రద్దయిన నేపథ్యంలో, విదేశీ పౌరులతో పాటు స్థానిక ప్రజలు కూడా విమానాశ్రయాల్లో చిక్కుకుపోయినట్లు వెల్లడించారు.
ఇరాన్లో భారత్తో పాటు ఇతర దేశాలకు చెందిన వందలాది మంది పౌరులు, విద్యార్థులు ఉన్నారు.
వివరాలు
భూసరిహద్దుల ద్వారా భారతీయులను తరలించే యోచ
పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది.
తొలి విడతలో సుమారు 100 మందితో కూడిన భారతీయులను టెహ్రాన్ నుంచి తరలించినట్లు సమాచారం.
ప్రస్తుతానికి ఇరాన్లో సుమారుగా 10,000 మంది భారతీయులు ఉన్నారని, వారిలో సుమారు 6,000 మంది విద్యార్థులేనని తెలుస్తోంది.
గగనతలాలపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో, భూసరిహద్దుల ద్వారా భారతీయులను తరలించే యోచనలో ఉందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఈ తరలింపు చర్యలు ఆర్మేనియా, అజర్బైజాన్, తుర్కమెనిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల మీదుగా భారతదేశానికి జరిగే అవకాశముందని వెల్లడించారు.