
Howard Lutnick: రష్యాతో చమురు కొనుగోలు ఆపితేనే భారత్ తో వాణిజ్య చర్చలు: లూట్నిక్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతిన్న వేళ వాణిజ్య చర్చలకు సంబంధించి అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లూట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చర్యను భారత్ నిలిపివేశాకే వాణిజ్య చర్చలను ముందుకు తీసుకెళ్లమనే సంకేతాలను ఆయన ఇచ్చారు. గతంలో ట్రంప్-మోదీ మధ్య స్నేహపూర్వక ట్వీట్లు ప్రచారంలో ఉన్న సమయంలో తీవ్ర హెచ్చరికలు చేసిన లూట్నిక్.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆచితూచి వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాలు విధిస్తూ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోంది. ప్రస్తుతం ఏ విషయంలో ఎక్కువ దృష్టి పెట్టున్నారని మీడియా ప్రశ్నించగా, లూట్నిక్ భారత్ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని నిలిపివేసిన తరువాత మాత్రమే భారత్తో వాణిజ్య చర్చలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.
వివరాలు
ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
అంతేకాదు, గతంలో వాణిజ్య చర్చల విషయంలో తీవ్రంగా స్పందించి.. భారత్ త్వరలోనే క్షమాపణలు చెప్పి చర్చలకు ముందుకొస్తుందని ఆయన అభిప్రాయపడ్డ విషయం ప్రజలకు తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇరుదేశాల మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నట్లు భారత వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయెల్ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య సంభాషణలు సంతృప్తికరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. మొదటి విడత ఒప్పందం ఈ నవంబర్ నాటికి పూర్తికానుందని, అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఈ ఫిబ్రవరిలో జరిగిన భేటీలో ట్రంప్-మోదీ తమ అధికారులను ఆదేశించిన విషయాన్ని గోయల్ గుర్తు చేశారు.