
Israel-Iran War: ఇరాన్పై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 585 మంది మృతి: మానవ హక్కుల సంస్థ
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడుల లక్ష్యం ముఖ్యంగా ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు నిల్వలు, అణుశుద్ధి కేంద్రాలే కావడం గమనార్హం.
తాజా దాడులతో టెహ్రాన్లోని అనేక కీలక ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం, ఇప్పటివరకు ఈ దాడుల్లో కనీసం 585 మంది ప్రాణాలు కోల్పోయారు.
అలాగే, దాదాపు 1326 మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. మృతుల్లో టెహ్రాన్కు చెందిన 239 మంది సాధారణ పౌరులు కాగా, 126 మంది భద్రతా సిబ్బందిగా గుర్తించారు.
బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వివరాలు
ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణి
ఇక మరోవైపు, ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య క్షిపణి దాడులు పరస్పరం కొనసాగుతున్నాయి.
బుధవారం తెల్లవారుజామున టెహ్రాన్ నగరంలో తీవ్రమైన పేలుడు ధ్వనులు వినిపించాయి.
ఈ నేపథ్యంలో అలారంలు మోగించడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
ఇదే సమయంలో టెల్ అవీవ్ నగరంలోనూ భారీ పేలుళ్లు సంభవించాయి.
పరి స్థితులు ఉద్రిక్తంగా మారిన కారణంగా, జెరూసలెంలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని శుక్రవారం వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
మరోవైపు, ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ప్రకటించగా, యుద్ధం మరింత తీవ్రతరమవుతోంది.
దీంతో వేలాదిమంది టెహ్రాన్ను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలవైపు వెళ్లిపోతున్నారు.
వివరాలు
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హతమార్చాలి : నెతన్యాహు
ఈ యుద్ధం కారణంగా పశ్చిమాసియా ప్రాంతమంతా ఉద్రిక్తతలతో ఉలిక్కిపడుతోంది.
ఇరుదేశాలు మిస్సైళ్లతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన ప్రకారం, ఈ యుద్ధం ముగియాలంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హతమార్చాల్సిందేనన్నారు.
అలా చేస్తేనే ఈ ఘర్షణ ముగుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా, ఇరాన్ అణు కార్యక్రమాలు ప్రపంచానికి తీవ్రమైన ముప్పు అని నెతన్యాహు హెచ్చరించారు.
అదేవిధంగా, ఇరాన్ కూటనీయత చర్యలను ఆయన పూర్తిగా తిరస్కరించారు. అవి దారి తప్పించే యత్నాలేనని పేర్కొన్నారు.
వివరాలు
"యుద్ధం మొదలైంది":ఖమేనీ
ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు.
ఖమేనీ ఎక్కడ దాగి ఉన్నారో తమకు సమాచారం ఉందని, అయితే ప్రస్తుతం అతన్ని హతమార్చే ఆలోచన తమకు లేదని తెలిపారు.
దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించిన ఖమేనీ, "యుద్ధం మొదలైంది" అంటూ ఒక పోస్ట్ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత భయానకంగా మారే అవకాశం కనిపిస్తోంది.