LOADING...
Jimmy Carter: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత

Jimmy Carter: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 30, 2024
08:09 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ (100) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్‌లో తుదిశ్వాస విడిచినట్లు ఆయన తనయుడు జేమ్స్‌ ఇ.కార్టర్‌ 3 తెలిపారు. జిమ్మీ కార్టర్‌ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ప్రథమ మహిళ జిల్‌ సంతాపం వ్యక్తం చేశారు. వ్యాధుల నిర్మూలన, శాంతి స్థాపన, పౌర, మానవ హక్కుల అభివృద్ధి, స్వేచ్ఛాయుత ఎన్నికల వంటి అంశాల్లో జిమ్మీ కార్టర్‌ తన అధ్యక్ష పదవిలో విశిష్టమైన ముద్ర వేశారని బైడెన్‌ కొనియాడారు. జిమ్మీ మృతి పట్ల కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కూడా సంతాపం వ్యక్తం చేశారు. అధికారిక అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్లు వైట్‌హౌస్‌ ప్రకటించింది.

వివరాలు 

హరియాణాలోని ఒక గ్రామానికి "కార్టర్పురి"గా నామకరణం

1924 అక్టోబర్‌ 1న జన్మించిన జిమ్మీ కార్టర్‌ ఈ ఏడాది తన వందో పుట్టినరోజును వేడుకగా జరుపుకున్నారు. జార్జియాలో జన్మించిన ఆయన 1977 నుండి 1981 వరకు అమెరికా 39వ అధ్యక్షుడిగా సేవలందించారు. ఒక రైతుగా, నేవీ ఉద్యోగిగా, గవర్నర్‌గా, అధ్యక్షుడిగా, అంతేకాదు మానవతావాదిగా ప్రపంచానికి విస్తృతంగా పరిచితులయ్యారు. 2002లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న కార్టర్‌ క్యాన్సర్ వంటి మహమ్మారిని జయించిన శక్తివంతమైన సంకల్పం కలిగిన వ్యక్తి. వందేళ్లు జీవించి, ప్రపంచానికి మార్గదర్శకుడిగా నిలిచిన అమెరికా అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు. 1978లో భారత్‌ను సందర్శించిన జిమ్మీ కార్టర్‌ పర్యటనకు గుర్తుగా హరియాణాలోని ఒక గ్రామానికి "కార్టర్పురి"గా నామకరణం చేశారు.