
Sheikh Hasina: 'కనిపిస్తే కాల్చేయండి'..బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేకంగా ఉద్యమం.. లీకైన ఆడియో.. వివాదంలో షేక్ హసీనా
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్లో గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పట్లో దేశ ప్రధాని హోదాలో ఉన్న షేక్ హసీనా నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఒక లీకైన ఆడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ ఆడియోను బీబీసీకి చెందిన డాక్యుమెంటరీలు వెల్లడించాయి. ఆ ఆడియోలోని సమాచారం ప్రకారం..హసీనా ఒక సీనియర్ పోలీసు అధికారికి నేరుగా ఆదేశాలు ఇచ్చారు. అందులో నిరసన కారులపై ప్రాణాంతక ఆయుధాలు వినియోగించాల్సిందిగా,అలాగే వారు ఎక్కడ కనిపించినా కాల్చి చంపేయాలని సూచించినట్లు తెలియవచ్చింది. ఈ ఆదేశాలను 2023 జులై 18న ఢాకాలో ఉన్న తన అధికార నివాసమైన గణభవన్ నుంచి జారీ చేసినట్టు బీబీసీ పేర్కొంది.
వివరాలు
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో 1,400 మంది మృతి
అదే రోజు కొన్ని గంటల తర్వాతే పోలీసులు నిరసనలపై తీవ్రంగా స్పందించి ఆయుధాలను వినియోగించినట్టు ఆ డాక్యుమెంట్స్ వెల్లడించాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు తీవ్ర రక్తపాతానికి దారి తీశాయి. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం, ఈ సంఘటనల్లో సుమారు 1,400 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్యమాల నేపథ్యంలో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అప్పటి నుంచి ఆమె పదవీచ్యుతురాలవగా, స్వదేశాన్ని వదిలి భారత్ చేరుకుని రహస్య ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.
వివరాలు
హసీనా పై బంగ్లాదేశ్లో అనేక కేసులు
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది. ఈ ప్రభుత్వం షేక్ హసీనాను తిరిగి దేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు, హసీనా పై బంగ్లాదేశ్లో అనేక కేసులు నమోదయ్యాయి. అంతర్జాతీయ నేర న్యాయ ధిక్కరణ కేసులో హసీనాకు ఆరు నెలల జైలు శిక్షను విధిస్తూ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ తీర్పు వెల్లడించింది.