'రాహుల్ గాంధీపై అనర్హత వేటు అప్రజాస్వామికం'; లండన్లో కాంగ్రెస్ నిరసన
లోక్సభ ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో లండన్లోని పార్లమెంట్ స్క్వేర్లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. రాహుల్పై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామికమైనదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి లేదా బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడితే ఏదైనా చేయడానికి వెనుకాడబోమని ప్రజల్లో భయాన్ని సృష్టించే ప్రయత్నంలో భాగంగానే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినట్లు ఆరోపించారు. 'మోదీ ఇంటిపేరు'పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి గరిష్ఠంగా శిక్షను విధించారని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ కమల్ ధాలివాల్ అన్నారు. అదానీ సమస్య నుంచి దేశ దృష్టిని మళ్లించే చర్య ఇదన్నారు.
మహాత్మా గాంధీ పాదాల వద్ద పుష్పాలు ఉంచి నిరసన
భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం లేకుండా పోయిందని, రాహుల్గాంధీ తన అభిప్రాయాన్ని పార్లమెంట్లో చెప్పేందుకు అనుమతించాలని ఐఓసీ కార్యదర్శి అస్రా అంజుమ్ అన్నారు. ఈ నిరసనలో 60 మందికిపైగా ప్రవాసులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ పాదాల వద్ద పుష్పాలు ఉంచి నిరసన తెలిపారు. ఇది శాంతియుతమైన కానీ శక్తివంతమైన ఉద్యమమని అంజుమ్ పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, రాహుల్ గాంధీపై భారత్లో చర్యలు పెరిగితే పెద్ద ఎత్తున ఇలాంటి నిరసనలు నిర్వహిస్తామని ఐఓసీ హెచ్చరించింది.