LOADING...
Trump: భారత్‌కు ట్రంప్ కొత్త హెచ్చరిక.. మరిన్ని అదనపు సుంకాలు
భారత్‌కు ట్రంప్ కొత్త హెచ్చరిక.. మరిన్ని అదనపు సుంకాలు

Trump: భారత్‌కు ట్రంప్ కొత్త హెచ్చరిక.. మరిన్ని అదనపు సుంకాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2025
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తోందన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌పై 50 శాతం టారిఫ్‌లు (సుంకాలు) విధించారు. ఇదే సమయంలో చైనా కూడా మాస్కోతో వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్నప్పటికీ, అదే తరహా చర్యలు చైనాపై కూడా తీసుకుంటారా అనే ప్రశ్నను విలేకరులు ట్రంప్‌కు వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో వేశారు. చైనా వంటి దేశాలు కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండగా.. భారత్‌నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని ఓ విలేకరి ట్రంప్‌ను ప్రశ్నించారు. 'ఎనిమిది గంటలు మాత్రమే గడిచాయి.. భవిష్యత్‌లో ఏమి జరుగుతుందో చూడాలి' అని పేర్కొన్నారు. ఇంకా చాలా పరిణామాలు జరగబోతున్నాయని, అదనపు సుంకాలు కూడా విధించబడతాయని ఆయన హెచ్చరించారు.

వివరాలు 

మాస్కోపై ఒత్తిడిని పెంచడం కోసమే ఈ చర్యలు

ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న యుద్ధాన్ని ముగింపుకు తీసుకెళ్లేందుకు మాస్కోపై ఒత్తిడిని పెంచడం కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకుంటున్న మరికొన్ని దేశాలపై కూడా ఇలాంటి చర్యలే తీసుకోవచ్చని,అందులో చైనా కూడా ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇటీవల భారత్‌ నుంచి దిగుమతిచేసే కొన్ని ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 25శాతం సుంకం విధించింది. ఇది గురువారం నుంచే అమల్లోకి రానుంది.అంతేకాకుండా,బుధవారం ట్రంప్‌ మరోసారి కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసి,అదనంగా మరో 25శాతం సుంకాలు విధించారు. ఇవి ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రంప్‌ విధించిన మొత్తం 50శాతం సుంకాల కారణంగా భారతదేశంలోని వస్త్ర పరిశ్రమ,జలచర ఉత్పత్తులు (ఆక్వారంగం),తోలు ఉత్పత్తులపై తక్షణ ప్రభావం చూపనుంది.

వివరాలు 

సహేతుకం కాదు: భారత్‌ 

ఈ సందర్భంగా భారత్‌ స్పందిస్తూ, ట్రంప్‌ తీసుకున్న అదనపు సుంకాలు అన్యాయమైనవి, అనుచితమైనవని పేర్కొంది. దేశ ప్రయోజనాలను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తేల్చిచెప్పింది.